ఇరాన్ యుద్ధం వేళ అమెరికా అణ్వాయుధ పరీక్ష.. మినిట్మ్యాన్ III ప్రత్యేకతలు ఇవే..
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం పతాక స్థాయికి చేరిన వేళ.. అగ్రరాజ్యం అమెరికా తన అమ్ములపొదిలోని అత్యంత శక్తివంతమైన అణ్వాయుధాన్ని పరీక్షించి ప్రపంచానికి బలమైన హెచ్చరిక పంపే ప్రయత్నం చేసింది. శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా.. అమెరికా వ్యూహాత్మక అణ్వాయుధ సంపత్తిలో కీలకమైన 'LGM-30G మినిట్మ్యాన్ III' ఖండాంతర క్షిపణిని విజయవంతంగా టెస్ట్ చేసింది. అయితే ఇరాన్ పై యుద్ధం చేస్తున్న ఇలాంటి కీలక సమయంలో న్యూక్లియర్ బాంబ్ టెస్టింగ్ అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.
నడిరాత్రి నిప్పులు చిమ్ముతూ..
కాలిఫోర్నియాలోని వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి మంగళవారం అర్ధరాత్రి ఈ ప్రయోగం జరిగింది. ఈ క్షిపణి నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన దృశ్యం అమెరికా సైనిక సన్నద్ధతకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇది నిరాయుధ క్షిపణి అయినప్పటికీ.. రెండు 'టెస్ట్ రీ-ఎంట్రీ వెహికల్స్'ను మోసుకెళ్లింది. యుద్ధ సమయంలో ఇవి అణుబాంబులను మోసుకెళ్లే కీలక భాగాలు. క్షిపణి పనితీరు, ఖచ్చితత్వాన్ని అంచనా వేయడమే తాజా 'GT 255' పరీక్ష ప్రధాన ఉద్దేశమని యూఎస్ మిలిటరీ చెబుతోంది.
హిరోషిమా కంటే వందల రెట్లు శక్తివంతం:
మినిట్మ్యాన్ III సామర్థ్యం వింటే ఎవరికైనా వణుకు పుట్టాల్సిందే. ఇది గంటకు 15వేల మైళ్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. అంటే ఖండాల మధ్య ఉన్న లక్ష్యాలను కేవలం నిమిషాల్లోనే తునాతునకలు చేయగలదు. సుమారు 6వేల మైళ్ల దూరంలోని లక్ష్యాలను ఇది ఛేదించగలదు. రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమా, నాగసాకిలపై వేసిన అణుబాంబుల కంటే ఇది వందల రెట్లు ఎక్కువ విధ్వంసాన్ని సృష్టించగలదు. అమెరికా రక్షణ వ్యవస్థలోని 'న్యూక్లియర్ ట్రైయాడ్' అంటే భూమి, నింగి, సముద్రం నుంచి అణ్వాయుధాలను ప్రయోగించే వ్యవస్థలో ఇది వెన్నెముక లాంటిది.
అమెరికా అధికారులు ఇది కేవలం సాధారణ పరీక్షేనని, ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే జరిగిందని చెబుతున్నప్పటికీ.. ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ పరిస్థితులు మరోలా ఉన్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం 6వ రోజుకు చేరుకోవడం, అమెరికా తన నౌకాదళాన్ని మధ్యప్రాచ్యానికి పంపడం వంటి పరిణామాల మధ్య ఈ పరీక్ష జరగడం చర్చనీయాంశంగా మారింది. మెుత్తానికి ఈ ప్రయోగం ద్వారా అమెరికా ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా వ్యవహరించింది. ఒకటి తన అణ్వాయుధాలు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాయని మిత్రదేశాలకు భరోసా ఇవ్వడం. రెండు తమ జోలికి వస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని ప్రత్యర్థులకు పరోక్షంగా హెచ్చరిక పంపడం.