42 లక్షల మంది డ్వాక్రా మహిళలకు డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ : మంత్రి దామోదర
వైద్యాధికారులకు మంత్రి దామోదర ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా 42 లక్షల మంది డ్వాక్రా మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, సమగ్ర డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. సెక్రటేరియట్లో బుధవారం జరిగిన సమీక్ష సమావేశంలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకూ అమలు చేయాల్సిన కార్యక్రమాలపై మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. సెర్ప్, వైద్యారోగ్య శాఖలు సమన్వయంతో పని చేయాలని, 99 రోజుల యాక్షన్ ప్లాన్ను రోజువారీ వైద్య సేవలకు ఆటంకం కలగకుండా అమలు చేయాలని సూచించారు.
అధికారుల ప్రతిపాదనలను స్వల్ప మార్పులతో ఆమోదించారు. టీ-డయాగ్నస్టిక్స్ నెట్వర్క్ ద్వారా సుమారు 30 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆరు నెలల్లో నాలుగు దశలుగా ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. సమావేశంలో ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత సత్యనారాయణ, ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్, డ్రగ్ కంట్రోల్ అథారిటీ డైరెక్టర్ జనరల్ షానవాజ్ ఖాసీం, డీఎంఈ నరేంద్ర కుమార్, టీవీవీపీ కమిషనర్ అజయ్కుమార్, డీహెచ్ రవిందర్ నాయక్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.