ఒక్కరు కాదు..ముగ్గురు ముద్దు
రెండో బిడ్డ, అంతకు మించి పిల్లలకు జన్మనిస్తే.. వారికి మెరుగైన పోషకాహారం కోసం పోషణ్ శిక్ష సురక్ష ప్యాకేజీ ఇస్తాం. ప్రస్తుతం రూ.2.50 లక్షల సార్వత్రిక ఆరోగ్య బీమా కల్పిస్తున్నాం. ఎక్కువమంది పిల్లలు కన్నవారికి అవసరమైతే ప్రత్యేకంగా బీమా కల్పిస్తాం. ప్రభుత్వోద్యోగులు ఒకర్ని మించి పిల్లల్ని కంటే పేరెంటింగ్ కోసం మగవారికి.. రెండో బిడ్డకు ఒక నెల, మూడో బిడ్డకు మరో నెల పాటు అదనంగా సెలవులు ఇస్తాం.
రాష్ట్రంలో సంతానోత్పత్తి వయసులోని దంపతులు సుమారు 90 లక్షల మంది ఉంటారు. వీరిలో 11.70 లక్షల మంది పిల్లలు పుట్టని వారుంటారు. వారిలో పేదలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐవీఎఫ్ చికిత్స అందిస్తాం.
ఈనాడు, అమరావతి: రెండో బిడ్డ, అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటే ప్రసవం సమయంలోనే ఒక్కో బిడ్డకు రూ.25 వేల చొప్పున తల్లిదండ్రులకు ప్రోత్సాహకం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆ పిల్లలకు 18 ఏళ్ల వరకు ఉచిత విద్య అందిస్తామని వెల్లడించారు. ఇద్దర్ని మించి కనే ప్రభుత్వోద్యోగులకు ప్రత్యేక సెలవులు ఇస్తామని వెల్లడించారు. ‘జనాభా నిర్వహణ విధానం’పై సీఎం చంద్రబాబు శాసనసభలో గురువారం ముసాయిదా ప్రకటన విడుదల చేశారు. ‘ఒకప్పుడు ఒకరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దు అన్నాం. ఇప్పుడు ఒకరు వద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు ముద్దు అని అంతా మాట్లాడాలి. రాష్ట్రంలో 1.5 ఉన్న సంతానోత్పత్తి రేటును 2.1కి చేర్చాల్సిన అవసరం ఉంది. దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలోనే జనాభా నిర్వహణ విధానం తెస్తున్నాం. ఆన్లైన్లోనూ పెడుతున్నాం. ఈ ముసాయిదా పాలసీపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నెల రోజులపాటు చర్చిస్తాం. అందరి అభిప్రాయాలు తీసుకుంటాం. ఏప్రిల్ 1 నుంచి అమలు ప్రారంభిస్తాం. ప్రజాప్రతినిధులు కూడా ప్రతి చోటా దీనిపై చర్చ జరిగేలా చూడాలి’ అని సూచించారు. జనాభా నిర్వహణపై ప్రతి నెలా నాలుగో శనివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.