నెయ్యికల్తీపై వాస్తవాలు వెలుగులోకి రావాలి
తిరుపతి (మంగళం), న్యూస్టుడే: ‘తిరుమల స్వామివారి లడ్డూలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందనే అంశంపై దేశవ్యాప్తంగా శ్రీవారి భక్తులు బాధపడుతున్నారు. నేను ఎక్కడికి వెళ్లినా ఇదే అంశాన్ని అడుగుతున్నారు. ఇందులో నిజాలు వెలుగులోకి వచ్చేలా కమిటీ విచారణ జరగాలి. ఎంత పెద్దవారున్నా శిక్షపడాలి అని సినీ నటుడు సుమన్ కోరారు. తిరుపతిలోని తిరుమలనగర్లో గురువారం ఆయన నటించిన ధర్మస్థల నియోజకవర్గం సినిమా ప్రమోషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘వేంకటేశ్వరస్వామిగా నటించిన మీరు లడ్డూ కల్తీ వ్యవహారంపై మీ అభిప్రాయం చెప్పండి’ అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన మాట్లాడారు. ‘కల్తీ జరిగిందని ఊరికే ఆరోపణలు చేయడం కాదు. దాన్ని నిరూపించేలా బలమైన విచారణ జరగాలి. ఇప్పటివరకు జరిగిన విచారణలో కల్తీ జరిగిందని కొందరు, జరగలేదని కొందరు వాదనలకు దిగుతున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని కోరుతున్నా, ఒక సిన్సియర్ కమిటీని పెట్టండి. బలమైన ఇన్వెస్టిగేషన్ టీమ్ను పెట్టి నిజాలు వెలుగులోకి తేవాలి. కల్తీ జరిగి ఉంటే అందులో ఎంతపెద్ద అధికారి ఉన్నా, నాయకులు ఉన్నా శిక్ష పడేలా చూడాలి. కల్తీకి పాల్పడినవారు మళ్లీ తిరుమల, తిరుపతి దేవస్థానంలో అడుగు పెట్టకుండా చర్యలు తీసుకోవాలి’ అని కోరుతున్నానని సుమాన్ చెప్పారు.