ఎల్పీజీ ఉత్పత్తిని పెంచండి.. రిఫైనరీలను కోరిన కేంద్ర ప్రభుత్వం
ఇంటర్నెట్డెస్క్: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధన మార్కెట్లో అనిశ్చితి నెలకొంది. దీంతో వంటగ్యాస్ లభ్యతను నిర్ధరించేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. ఎల్పీజీ (liquefied petroleum gas) ఉత్పత్తిని పెంచాలని రిఫైనరీలను ఆదేశించింది. దేశీయ సరఫరాలకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ఈ ఎల్పీజీ (LPG) ప్రభుత్వరంగ కంపెనీలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్కు మాత్రమే విక్రయించాలని తన ఆదేశాల్లో పేర్కొంది. ఆ సరఫరాలు దేశీయ వినియోగదారులకు మాత్రమే చేరేలా చూడాలని ఆ మూడు సంస్థలకు సూచించింది.
ఎల్పీజీని ఉత్పత్తి చేయడానికి కీలకమైన ప్రొపేన్, బ్యూటేన్ను పెట్రో కెమికల్ ప్రొడక్షన్ కోసం దారి మళ్లించవద్దని కేంద్రం రిఫైనరీలకు స్పష్టం చేసింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన వంటి పథకాల ద్వారా దేశంలో ఎల్పీజీ గృహ వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ ఇంధన అవసరాలు తీర్చుకునేందుకు 60 శాతం దిగుమతుల పైనే ఆధారపడాల్సిన పరిస్థితి. దాంతో అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, రవాణాలో అంతరాయాలు ఏర్పడినా దేశీయంగా ఆ ప్రభావం కనిపిస్తుంటుంది.