భారత్ తీర సమీపంలో.. 1.5 కోట్ల బ్యారెళ్ల రష్యా చమురు
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్తో ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం నేపథ్యంలో.. చమురు రవాణాపై తీవ్ర ప్రభావం పడిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం వేళ భారత్కు ఊరట లభించింది. యుద్ధం వేళ రష్యా చమురు (Russian Oil)ను దిగుమతి చేసుకునేందుకు భారత్ (India)కు అమెరికా మినహాయింపు ఇవ్వడంతో.. రష్యా నుంచి 1.5 కోట్ల బ్యారెళ్ల చమురున్న డజనుకు పైగా ట్యాంకర్ నౌకలు బయల్దేరినట్లు బ్లూమ్బెర్గ్ కథనం వెల్లడించింది. అరేబియా సముద్రం మీదుగా మరికొన్ని రోజుల్లో అవి భారత్కు చేరుకోనున్నట్లు తెలుస్తోంది.
బ్లూమ్బెర్గ్ విడుదల చేసిన షిప్ ట్రాకింగ్ డేటా ప్రకారం.. అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో డజనుకు పైగా ముడి చమురు ట్యాంకర్లు భారత్ తీరానికి సమీపంలో ఉన్నాయి. మరో వారం రోజుల్లో అవి ఓడరేవులకు చేరుకునే అవకాశం ఉంది. దాదాపు 7 మిలియన్ బారెళ్ల రష్యన్ చమురును మోసుకెళ్లే మరో 8 నౌకలు కూడా సింగపూర్ సముద్రప్రాంతంలో నిలిచిఉన్నాయి. అవికూడా త్వరలో భారత్కు రానున్నట్లు తెలుస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోలుకు అమెరికా లైసెన్స్ జారీ చేయడానికి ముందే.. భారత ఓడరేవుల వైపు వచ్చే దిశగా రష్యా నౌకలు తమ గమ్యస్థానాలను మార్చినట్లు బ్లూమ్బెర్గ్ పేర్కొంది.
2022 నుంచి రష్యా చమురును భారత్ గణనీయంగా దిగుమతి చేసుకుంటుంది. అయితే.. అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇటీవల ఈ దిగుమతులు తగ్గాయి. ప్రస్తుతం పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు రవాణాలో అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన రవాణాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ క్రమంలోనే రష్యా మళ్లీ ఎగుమతి చేస్తుండడంతో భారత్కు చమురు కష్టాలు తొలగిపోయే అవకాశం ఉంది.