రాబోయే ఏడాదికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం: చంద్రబాబు
అమరావతి: రాష్ట్రంలో ఎలాంటి విభేదాలు లేకుండా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. మూడు పార్టీల నేతలు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా శాసనసభలో చంద్రబాబు మాట్లాడారు.
‘‘గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకున్నారు. ఇష్టానుసారం అప్పులు చేసి ప్రజలపై భారం మోపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రీషెడ్యూల్ చేయించాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. పథకాలు కొనసాగిస్తున్నాం. రాబోయే ఏడాదికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. కేంద్రం సహకారంతో ప్రపంచం మెచ్చేలా అమరావతిని తీర్చిదిద్దుతున్నాం. మూడు పార్టీల్లోనూ చాలామంది కొత్త సభ్యులు వచ్చారు. అప్పటి ప్రభుత్వంపై పోరాడిన వారిలో చాలామందికి సీట్లిచ్చాం. నిలబెట్టిన అభ్యర్థుల్లో 94 శాతం మందిని గెలిపించారంటే అది మాపై ప్రజల్లో ఉన్న నమ్మకం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సఖ్యతతో పనిచేస్తున్నాయి. రాష్ట్రాన్ని గట్టెక్కించే బాధ్యత తీసుకొని ముందుకెళ్తున్నాం’’
‘‘ప్రతిపక్ష హోదా ఎవరో ఇచ్చేది కాదు.. ప్రజలు ఇవ్వాలి. వారికి ప్రతిపక్ష హోదాకు తగ్గట్లుగా సీట్లు ఇవ్వలేదు. ఇప్పటికీ బాధ్యత లేకుండా వైకాపా వాళ్లు మాట్లాడుతున్నారు’’ అని చంద్రబాబు మండిపడ్డారు.