బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
దిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో బహ్రెయిన్లో చిక్కుకున్న 600 మంది తెలుగు ప్రజలను స్వదేశానికి రప్పించే ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి రోజూ ఒక విమానంలో స్వదేశానికి చేరుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశంతో గల్ఫ్ ఎయిర్ సంస్థతో ఏపీ భవన్ అధికారులు సంప్రదింపులు జరిపారు. డీజీసీఏ, పౌరవిమానయాన శాఖ అధికారులతో చర్చించిన తర్వాత సదరు సంస్థ విమాన సేవలు ప్రారంభించింది. ఇవాళ 58 మందిని కొచ్చి విమానాశ్రయానికి తీసుకురానుంది.
బుధవారం 138 మందితో మరో విమానం ముంబయి చేరుకోనుంది. బహ్రెయిన్లోని తెలుగు సంఘం, భారత రాయబార కార్యాలయం ద్వారా టికెట్లు కొనుగోలు చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. అక్కడ చిక్కుకున్న వారంతా సురక్షితంగా స్వదేశానికి చేరేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మరోవైపు.. పశ్చిమాసియాలో చిక్కుకున్న తెలుగువారికి సహాయం కోసం ఏపీ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. గల్ఫ్, బహ్రెయిన్ తెలుగు సంఘాల వారితో మాట్లాడి ఏపీ భవన్ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారు.