‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ పూర్తి.. రన్టైమ్, అసలు సవాల్ ఏంటో తెలుసా?
ఇంటర్నెట్డెస్క్: ఈ వేసవికి చక్కటి వినోదాన్ని పంచడానికి తాను సిద్ధమంటున్నాడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad bhagat singh). పవన్కల్యాణ్ కథానాయకుడిగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. శ్రీలీల, రాశీఖన్నా కథానాయికలు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఉగాది కానుకగా మార్చి 19న (ustaad bhagat singh release date) ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకోగా, ఎలాంటి కట్స్ లేకుండా యూ/ఏ సర్టిఫికెట్ వచ్చినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ పవన్కల్యాణ్ - శ్రీలీల నడిచి వస్తున్న పోస్టర్ను విడుదల చేశారు. ఇక ఈ మూవీ రన్ టైమ్ 2 గంటల 34 నిమిషాలుగా (Ustaad bhagat singh runtime) నిర్ణయించారు.
ఈ వేగం సరిపోదు ‘ఉస్తాద్’..
తొలుత అనుకున్న షెడ్యూల్ ప్రకారం మార్చి 26న ఈ మూవీ విడుదల కావాల్సి ఉంది. ‘టాక్సిక్’ వాయిదాతో వారం ముందుకు జరిగింది. వరుస సెలవుల నేపథ్యంలో ‘ఉస్తాద్’ ముందుకు రావడం మంచి నిర్ణయమే అయినా, ‘ధురంధర్2’ నుంచి గట్టి పోటీ ఎదుర్కొని నిలబడాలి. మూవీ విడుదల, టికెట్స్ విషయంలో ‘ధురంధర్2’ చాలా స్పష్టంగా ఉంది. ఇప్పటికే పెయిడ్ ప్రీమియర్స్ టికెట్స్ ఓపెన్ అయ్యాయి. మొదటి భాగం అంచనాలను పెంచిన నేపథ్యంలో ‘పార్ట్2’ బుకింగ్స్ హాట్ కేక్స్గా అమ్ముడవుతున్నాయి. రెగ్యులర్ షోలకు సంబంధించి టికెట్స్ ఇంకా ఓపెన్ చేయలేదు. ఈ క్రమంలో ‘ఉస్తాద్’ ముందున్న అసలు సవాల్ ప్రతి అప్డేట్ పక్కాగా ఆన్టైమ్లో తీసుకురావడమే.
ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ టీజ్ మూవీపై ఆసక్తిని పెంచింది. ఇక ఇప్పుడు అసలు కార్యక్రమం ఉంది. అదే ఉస్తాద్ భగత్సింగ్ ట్రైలర్ (ustaad bhagat singh trailer). దానిని అనుకున్న టైమ్కు పర్ఫెక్ట్ కట్స్తో ఎలాంటి ఇబ్బంది లేకుండా విడుదల చేయగలిగితే మిగిలింది ఫ్యాన్స్ చూసుకుంటారు. అలాగే ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు? ఎక్కడ పెడతారు? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. వీటన్నింటి కన్నా మరో అతి ముఖ్యమైన టాస్క్.. తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ టికెట్స్. ఏపీలో ఎలాగూ ప్రీమియర్స్కు అనుమతి లభిస్తుంది. తెలంగాణలో పరిస్థితి ఏంటన్నది తెలియాలి. ప్రీమియర్ టికెట్స్ విషయంలో ఉన్నత న్యాయస్థానం చీవాట్లు పెట్టిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఎలా అడుగులు వేస్తుందన్నది వేచి చూడాలి.