Chiranjeevi : నాడు నా వేలు పట్టుకున్న చిన్నారి.. నేడు నాకే బ్లాక్బస్టర్ ఇచ్చింది.. కూతురిపై మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్!
మెగాస్టార్ చిరంజీవికి తన పిల్లలంటే ఎంత ప్రాణమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా తన పెద్ద కుమార్తె, నిర్మాత సుస్మిత కొణిదెల అంటే ఆయనకు అమితమైన ప్రేమ. ఈరోజు (మార్చి 10) సుస్మిత పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఒక తండ్రిగా తన కూతురి ఎదుగుదలపై గర్వపడుతూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా..
చిరంజీవి తన పోస్ట్లో గత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. నా ప్రియమైన సుస్మితకు (హనీ పాపా) పుట్టినరోజు శుభాకాంక్షలు. ఒకప్పుడు నా వేలు పట్టుకుని నా పక్కన నడిచిన చిన్న అమ్మాయివి.. నేడు ఒక బలమైన, అందమైన, బాధ్యతాయుతమైన మహిళగా ఎదిగావు. ఇది ఒక తండ్రిగా నాకు అత్యంత గర్వకారణమైన విషయం అని పేర్కొన్నారు. నువ్వు నా సినిమాలు చూడటం నుంచి, నేడు నా సినిమానే నిర్మించే స్థాయికి ఎదగడం, నాకు ఒక మర్చిపోలేని బ్లాక్బస్టర్ను బహుమతిగా ఇవ్వడం నా జీవితంలో అత్యంత ప్రత్యేకమైన క్షణం అని చిరు కొనియాడారు.
తండ్రికి కూతురిచ్చిన కానుక
ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన 'మనశంకర వరప్రసాద్గారు' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రానికి సుస్మిత కొణిదెల నిర్మాతగా వ్యవహరించారు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ఆమె ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. కేవలం కాస్ట్యూమ్ డిజైనర్గానే కాకుండా, అభిరుచి గల నిర్మాతగా కూడా తాను సక్సెస్ అయ్యానని ఈ సినిమాతో సుస్మిత నిరూపించుకున్నారు. తండ్రి ఇమేజ్కు తగ్గట్టుగా, విభిన్నమైన కథాంశంతో సినిమాను మలిచి చిరంజీవికి కెరీర్ బెస్ట్ హిట్స్లో ఒకటిగా నిలిపారు.