విమానంలో సాంకేతిక లోపం.. ‘పాన్-పాన్’ సిగ్నల్ పంపిన పైలట్లు
ఇంటర్నెట్ డెస్క్: తిరువనంతపురం నుంచి దిల్లీ బయలుదేరిన ఎయిరిండియా (Air India) ఎక్స్ప్రెస్ విమానం ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఎమర్జెన్సీ ప్రకటించిన పైలట్.. ‘పాన్-పాన్’ కాల్తో స్థానిక ఏటీసీని అప్రమత్తం చేశారు. చివరకు విమానం సురక్షితంగా ల్యాండ్ (Emergency Landing) కావడంతో సిబ్బంది, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
బుధవారం తెల్లవారుజామున తిరువనంతపురం నుంచి ఎయిరిండియా విమానం.. దిల్లీకి బయల్దేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఓ ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్లో సమస్య ఉన్నట్లు పైలట్ గుర్తించారు. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు పాన్-పాన్ (PAN-PAN) సిగ్నల్ ఇచ్చారు. ప్రామాణిక నిర్వహణ విధానానికి (SOP) అనుగుణంగా గ్రౌండ్ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. పైలట్లు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో ప్రయాణికులను కిందకు దించేసి, విమానంలో సాంకేతిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.
పాన్-పాన్ సిగ్నల్ అనేది సముద్రయానం, వైమానిక కమ్యూనికేషన్ వ్యవస్థలో భాగం. ఇదో ఎమర్జెన్సీ సందేశం. విమానయానంలో ఇది అత్యవసర పరిస్థితిని సూచించినప్పటికీ.. మేడే (MAYDAY) సిగ్నల్ అంత తీవ్ర పరిస్థితి కాదు. ప్రయాణికులకు, సిబ్బందికి ప్రాణాపాయస్థితి లేకున్నా.. సాయం కావాలని విజ్ఞప్తి చేసే ఓ సందేశం. పైలట్ ‘పాన్-పాన్’ సిగ్నల్ ఇచ్చారంటే.. ఏటీసీ లేదా గ్రౌండ్ సర్వీసు నుంచి తక్షణ సాయం అవసరమని అర్థం. పైలట్ నుంచి ఈ సిగ్నల్ అందుకున్న వెంటనే అంబులెన్సులు, అగ్నిమాపక బృందాలతో క్షేత్రస్థాయి సిబ్బంది రన్వే సమీపంలో మోహరిస్తారు. అత్యవసర పరిస్థితికి అనుగుణంగా స్పందిస్తారు.