మూసీ ప్రాజెక్టు మొదటి దశ డీపీఆర్ తయారైంది: మంత్రి శ్రీధర్బాబు
అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మంత్రి శ్రీధర్బాబు సమాధానం సంతృప్తిగా లేదన్నారు. ‘‘డీపీఆర్ తయారీకి 18 నెలలు పడుతుందని జనవరిలో చెప్పారు. పాకిస్థాన్లో నిషేధించిన కంపెనీకి అవకాశం ఇచ్చారు. డీపీఆర్ను సభ ముందు పెట్టాలి. రుణానికి ఏడీబీ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు గతంలో సభలో మంత్రి తెలిపారు. కానీ.. డీపీఆర్ ఇవ్వలేదని.. రుణం మంజూరు చేయలేదని ఏడీబీ స్పష్టం చేసింది. సభను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారా?రూ.16వేల కోట్లతో అయ్యే ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రూ.లక్షన్నర కోట్లు అని చెప్పారు. మొదటి దశ రూ.7వేల కోట్లు అంటున్నారు.. ఇంకా ఎన్ని దశలు ఉంటాయి? ఎన్ని నివాసాలు కూలుస్తారు? మంత్రి 1,435 నిర్మాణాలు అన్నారు.. గెజిట్లో 10వేల నిర్మాణాలు అని పేర్కొన్నారు. వీటిలో ఏది కరెక్ట్?. మూసీ ప్రాజెక్టుకు మేం వ్యతిరేకం కాదు.. అందులో జరుగుతున్న దోపిడీకి మాత్రమే వ్యతిరేకం.’’అని కేటీఆర్ ప్రశ్నించారు.
శాసనసభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. మూసీ ప్రాజెక్టుపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కేటీఆర్ తెలిపారు. ‘‘ప్రభుత్వం దగ్గర నిధులు లేవు.. ప్రణాళికలు లేవు. ఏడీబీ రుణం ఇవ్వలేదు. రూ.లక్షన్నర కోట్ల దోపిడీకి మేం వ్యతిరేకం. ప్రభుత్వ వైఖరికి నిరసనగా వాకౌట్ చేస్తున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్: మూసీ ప్రాజెక్టుపై తెలంగాణ శాసనసభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. మూడోరోజు సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. మూసీ ప్రాజెక్టుపై ఎమ్మెల్యేలు సుధీర్రెడ్డి, కాలేరు వెంకటేశ్ తదితరులు మాట్లాడారు. అనంతరం మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ మొదటి దశ డీపీఆర్ తయారైందని చెప్పారు. అంచనా వ్యయం రూ.6,500 కోట్ల నుంచి రూ.7000 కోట్లుగా చెప్పారు. ఈ ప్రాజెక్టుతో 1,435 నిర్మాణాలు ప్రభావితమయ్యే అవకాశముందన్నారు. తుది ఎన్యుమరేషన్ కొనసాగుతోందని చెప్పారు. బఫర్ జోన్లో ఉన్నవారికి టీడీఆర్ ఇస్తామని.. 2013 చట్టం ప్రకారం అవసరమైన భూసేకరణ, సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపడతామని మంత్రి వివరించారు.