ఇరాన్కు శాశ్వత నష్టం తప్పదు: ట్రంప్
ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్-అమెరికా సంయుక్త దాడుల వల్ల ఇప్పటికే ఇరాన్ భారీగా నష్టపోయింది. ఓవైపు కీలక నేతలు వరుసగా ప్రాణాలు కోల్పోతుండగా.. మరోవైపు అణు స్థావరాలు, పౌర నివాసాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (US President Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై దాడులు ఇంకా ముగియలేదని.. ఆ దేశానికి శాశ్వత నష్టం కలిగించడానికి అగ్రరాజ్యం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇప్పుడే యుద్ధాన్ని ఆపేసినా ఆ దేశాన్ని పునర్నిర్మించుకోవడానికి అక్కడి పాలకులకు 10 ఏళ్ల సమయం పడుతుందని అన్నారు. కానీ మళ్లీ కోలుకోలేనివిధంగా ఇరాన్కు నష్టం కలిగించాలన్నదే తమ లక్ష్యమని వెల్లడించారు.
మరో అధ్యక్షుడు ఇటువంటి తప్పు చేయకుండా ఇరాన్ (Iran)కు తగిన బుద్ధి చెబుతామని ట్రంప్ పేర్కొన్నారు. ఆ దేశంపై తాము చేపట్టిన ఆపరేషన్ సరైన దిశలోనే వెళుతోందన్నారు. భవిష్యత్తులో ఇరాన్ నుంచి ఎవరికీ అణుముప్పు కలగకుండా చూడటమే తమ లక్ష్యమన్నారు. మరో రెండు వారాల పాటు ఈ యుద్ధం కొనసాగే అవకాశం ఉందన్నారు. తాము ముందస్తు దాడులను ప్రారంభించకపోయి ఉంటే ఇరాన్ ఇప్పటికే పలు అణ్వాయుధాలను అభివృద్ధి చేసేదని పేర్కొన్నారు.
హర్మూజ్ జలసంధికి యుద్ధ నౌకలను పంపడానికి నాటోతో పాటు మిత్రదేశాలు నిరాకరించడంపై ట్రంప్ అసహనం వ్యక్తంచేశారు. ఈ విషయంలో నాటో తెలివితక్కువగా ప్రవర్తిస్తోందన్నారు. హర్మూజ్ జలసంధి (Strait Of Hormuz)ని తెరిపించాల్సిన అవసరం ఉన్నప్పటికీ తమ మిత్రదేశాలు ముందుకురావట్లేదన్నారు. అయినప్పటికీ వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు. తమది ప్రపంచంలోనే అత్యంత బలమైన దేశమని..అత్యంత శక్తిమంతమైన సైన్యం తమకు ఉందని పునరుద్ఘాటించారు.