అమెరికా ఎఫ్-35 యుద్ధ విమానాన్ని కూల్చామన్న ఇరాన్
అమెరికాకు చెందిన అత్యాధునిక యుద్ధ విమానంపై ఇరాన్ దాడి చేసింది. ప్రపంచంలోనే మొదటిసారి అమెరికా ఎఫ్-35 (F-35) యుద్ధ విమానాన్ని కూల్చామని ఇరాన్ ప్రకటించింది. అమెరికా రక్షణ వర్గాలు కూడా ఈ విషయాన్ని పాక్షికంగా ధృవీకరించాయి.
జరుగుతున్న యుద్ధంలో ఒక సంచలన పరిణామం చోటుచేసుకుంది. అమెరికా గర్వకారణంగా భావించే ఐదో తరం (5th Generation) అత్యాధునిక ఎఫ్-35 లైట్నింగ్ 2 (F-35 Lightning 2) యుద్ధ విమానాన్ని తాము విజయవంతంగా ఢీకొట్టామని ఇరాన్ ప్రకటించింది. ప్రపంచంలోనే ఈ విమానాన్ని తాకిన మొదటి దేశం తామేనని ఇరాన్ పేర్కొంది.
ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC), మధ్య ఇరాన్ గగనతలంపై ఎగురుతున్న అమెరికా ఎఫ్-35 విమానాన్ని తమ అధునాతన రక్షణ వ్యవస్థలతో ఢీకొట్టినట్లు తెలిపింది. ఈ ఘటన తెల్లవారుజామున 2:50 గంటలకు జరిగినట్లు పేర్కొంది. అమెరికా రక్షణ వర్గాలు (CENTCOM) కూడా ఈ విషయాన్ని పాక్షికంగా ధృవీకరించాయి. ఇరాన్ వైపు నుంచి జరిగిన క్షిపణి దాడుల కారణంగా ఒక ఎఫ్-35 విమానం తీవ్రంగా దెబ్బతిన్నదని, దానిని అత్యవసరంగా (Emergency Landing) మధ్యప్రాచ్యంలోని ఒక బేస్లో ల్యాండ్ చేసినట్లు వెల్లడించాయి.
విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని, పైలట్ క్షేమంగా ఉన్నారని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. ఎఫ్-35 అనేది రాడార్లకు చిక్కని 'స్టెల్త్' సాంకేతికత కలిగిన అత్యంత ఖరీదైన (సుమారు 100 మిలియన్ డాలర్లు) విమానం. దీనిని ఇరాన్ లక్ష్యంగా చేసుకోవడం రక్షణ రంగ నిపుణులను విస్మయానికి గురిచేస్తోంది.
ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా తన మూడు ఎఫ్-15 (F-15) విమానాలను కువైట్ రక్షణ వ్యవస్థల పొరపాటు (Friendly Fire) వల్ల కోల్పోగా, ఒక కేసీ-135 (KC-135) ఇంధన విమానం ఇరాక్లో కూలిపోయింది.