Harish Rao: ఫిలిప్పీన్స్కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వడంలో అలసత్వం వహించడంతో పాటు పీఆర్సీ డీఏ విషయంలో సీపీఎస్ విషయంలో, ఉద్యోగుల పట్ల ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
హైదరాబాద్: ఫిలిప్పీన్స్కు బియ్యం ఎగుమతి చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. సీబీఐ, ఈడీ కేసుల్లో నిందితుడిగా ఉన్న ప్రేమ్ చంద్ గార్గ్ అనే వ్యక్తిని ఈ ఎగుమతులకు అడ్వైజర్గా నియమించుకోవడంపై ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. పది లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి చేస్తామని గొప్పగా ఎంవోయూ (MoU) చేసుకున్న ప్రభుత్వం, కేవలం 22,750 టన్నుల వద్దే ఎందుకు ఆగిపోయిందని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో వాటాలు తేలకపోవడం వల్లే ఎగుమతులు నిలిచిపోయాయని ఆయన విమర్శించారు.
కాకినాడ పోర్టులో ముక్కిపోయిన బియ్యం
సుమారు ఏడాది కాలంగా 7,500 టన్నుల బియ్యం కాకినాడ పోర్టులోనే ఉండిపోయాయని, అవి పురుగులు పట్టి ముక్కిపోతున్నాయని హరీశ్ రావు సభ దృష్టికి తెచ్చారు. ఇంతటి నష్టం జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో సమాధానం చెప్పాలన్నారు. సివిల్ సప్లై శాఖలో జరిగిన ఈ అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ, ఆధారాలతో సహా అన్ని నిరూపిస్తామని సవాల్ విసిరారు. భవిష్యత్తులో తాము అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడు ఈ కుంభకోణాలపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని హెచ్చరించారు.
రైతులకు బోనస్ పై ప్రశ్నలు
యాసంగి వరి పంటకు సంబంధించి రైతులకు ప్రకటించిన బోనస్ ఎప్పటిలోపు చెల్లిస్తారో మంత్రి స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదని హరీశ్ రావు మండిపడ్డారు. ప్రభుత్వం అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వకుండా దాటవేస్తోందని ఆరోపిస్తూ, నిరసనగా సభలోనే బైఠాయించారు. రైతుల ప్రయోజనాల కంటే అడ్వైజర్ల సలహాలకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆయన విమర్శించారు.