ఆపరేషన్ ‘ఊర్జా సురక్షా’.. చమురు నౌకలకు మన నేవీ భద్రత ఇలా..!
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియా యుద్ధ మేఘాలను దాటి కొన్ని చమురు, గ్యాస్ నౌకలు ఒక్కొక్కటిగా భారత్కు చేరుకుంటున్నాయి. దేశీయ ఇంధన ప్రయోజనాలను కాపాడటంలో భాగంగా ఈ నౌకల భద్రత కోసం భారత నేవీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ‘ఆపరేషన్ ఊర్జా సురక్షా’ను ప్రారంభించి.. చమురు/ఎల్పీజీ నౌకలను సురక్షితంగా హర్మూజ్ను దాటిస్తోంది. ఈ ఆపరేషన్కు సంబంధించిన వివరాలను కొన్ని ఆంగ్ల పత్రికలు ప్రచురించాయి.
సాధారణంగా భారత్ వచ్చే చమురు/గ్యాస్ నౌకలు సౌదీ అరేబియాలోని రాస్ తనురా వంటి పోర్టుల నుంచి ప్రయాణం ప్రారంభిస్తాయి. ఇవి పర్షియన్ గల్ఫ్ మీదుగా హర్మూజ్ జలసంధి వద్దకు చేరుకుంటాయి. నౌక వేగం, ప్రయాణించే మార్గాన్ని బట్టి ఇందుకు గరిష్ఠంగా రెండు రోజుల సమయం పడుతుంది. ప్రస్తుతం ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ జలసంధి వద్దే వందలాది నౌకలు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. దీంతో వాటిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు భారత నౌకాదళం రంగంలోకి దిగింది. ఇరాన్ అధికారుల నుంచి అనుమతులు తీసుకోవడంతో పాటు నౌకలు జలసంధి దాటేవరకు అనుక్షణం వాటికి సహాయసహకారాలు అందిస్తోంది. హర్మూజ్ దాటిన తర్వాత ఈ నౌకలు గల్ఫ్ ఆఫ్ ఒమన్లోకి ప్రవేశించి అక్కడినుంచి అరేబియా సముద్రంలోకి వస్తాయి. దీంతో ఈ రెండు ప్రాంతాల వద్ద భారత నేవీ 5 యుద్ధ నౌకలను మోహరించింది.
ఈ యుద్ధ నౌకల సహకారంతోనే ఇటీవల రెండు గ్యాస్ ట్యాంకర్లు పైన్ గ్యాస్, జగ్ వసంత్ అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించి భారత్ దిశగా పయనిస్తున్నాయి. అంతకుముందు శివాలిక్, నందాదేవి వంటి గ్యాస్ నౌకలు కూడా ఈ ఆపరేషన్లో భాగంగానే దేశీయ పోర్టులకు చేరుకోగలిగాయి. ప్రస్తుతం ఇక్కడ భారత్కు రావాల్సిన 22 నౌకలు తరలింపునకు సిద్ధంగా ఉన్నాయి. వీటిల్లో 20 వరకు ఎల్పీజీ, ఎల్ఎన్జీ, క్రూడ్ ఆయిల్ రవాణా చేస్తున్నవే..!
సాధారణంగా సముద్రంలో ప్రయాణం హైడ్రోగ్రాఫిక్ చార్ట్లు, నావిగేషన్ వ్యవస్థల ఆధారంగా ఉంటుంది. ప్రస్తుతం ఉద్రిక్తతల నేపథ్యంలో హర్మూజ్ జలసంధి సమీపంలో ఇరాన్ సీమైన్స్ను అమర్చినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వీటిల్లో చాలావరకు బయటకు కన్పించవు. వీటి కారణంగా నౌకలకు తీవ్ర ముప్పు పొంచి ఉంటుంది. అందుకే, ఈ సీమైన్స్ తగలకుండా నౌకలను హర్మూజ్ను దాటించడం అత్యంత ఆవశ్యకం. దీన్ని గుర్తించిన భారత నేవీ.. మన నౌకల కోసం ప్రత్యేక హైడ్రోగ్రాఫిక్ చార్ట్లను రూపొందిస్తోంది. నిఘా నౌకలతో సముద్ర గర్భాన్ని స్కాన్ చేసి నావిగేషన్ రూట్స్ను గుర్తిస్తోంది. ఆయా మార్గాలను నౌకలకు ఎప్పటికప్పుడు అందిస్తూ వాటిని హర్మూజ్ నుంచి తీసుకొస్తోంది.
ఇదిలాఉండగా.. హర్మూజ్ జలసంధిని దాటే నౌకలకు ఛార్జీలు విధిస్తామని ఇరాన్ చెప్పినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అవన్నీ అవాస్తవమని భారత్లోని ఇరాన్ రాయబార కార్యాలయం తెలిపింది. అయితే, దీనిపై తాజాగా ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు గందరగోళం సృష్టిస్తున్నాయి. హర్మూజ్లో నౌకల సురక్షిత ప్రయాణానికి ఫీజులు వసూలు చేస్తామని ఓ మీడియా ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం గమనార్హం. మరోవైపు, అమెరికా-ఇజ్రాయెల్ సంబంధిత నౌకలు మినహా మిగిలినవన్నీ హర్మూజ్ మీదుగా ప్రయాణించవచ్చని ఐరాస సమావేశంలో ఇరాన్ ప్రకటన చేసింది.