సీఎస్కే అభిమానులకు నిరాశ.. ధోని 2 వారాలు దూరం
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్కు పెద్ద షాక్ తగిలింది. క్రికెట్ దిగ్గజం ధోని ఆటను చూడాలనుకొనే అభిమానులకు నిరాశ ఎదురైంది. మొన్నటివరకూ ప్రాక్టీస్ సెషన్లోనూ పాల్గొన్న ధోని.. తాజాగా పిక్క గాయం కారణంగా రెండు వారాలు ఆటకు దూరమైనట్లు సీఎస్కే వెల్లడించింది. త్వరగా కోలుకొని రావాలని ఆకాంక్షిస్తూ ఎక్స్లో పోస్టు చేసింది. దీంతో అతడి స్థానంలో ఉర్విల్ పటేల్కు అవకాశం రావచ్చు. ఇప్పటికే సంజు శాంసన్ రూపంలో వికెట్ కీపర్ ఉన్నప్పటికీ.. యువ బ్యాటర్ను తీసుకొనే ఆలోచనలో సీఎస్కే మేనేజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది.
చెన్నై సూపర్ కింగ్స్ తన తొలి మ్యాచ్ను రాజస్థాన్ రాయల్స్తో మార్చి 30న ఆడనుంది. ధోని తొలి రెండు వారాలు దూరం కానున్న నేపథ్యంలో.. కనీసం నాలుగు మ్యాచులను మిస్ అయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ 3న పంజాబ్తో, ఏప్రిల్ 5న ఆర్సీబీతో, ఏప్రిల్ 11న దిల్లీతో ఆడనుంది. అప్పటికి ధోని సిద్ధమైతే.. ఏప్రిల్ 14న కోల్కతాతో జరగనున్న మ్యాచ్లో ఆడే అవకాశం ఉంటుంది. కనీసం ఇంపాక్ట్ ప్లేయర్గానైనా వస్తాడని ఆశించిన అభిమానులకు ఇది తీవ్ర నిరాశ కలిగించేదే. ధోని గైర్హాజరీలో రుతురాజ్ - సంజుశాంసన్ పైనే ఎక్కువ భారం ఉండనుంది. ఆరో టైటిల్పై కన్నేసిన సీఎస్కే ఎలా ఆడుతుందో చూడాలి మరి.