విమాన ఇంధనంపై రాష్ట్రాలు పన్ను తగ్గించాలి: మంత్రి రామ్మోహన్ నాయుడు
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో యుద్ధంతో దేశంలో ఇంధన కొరత ఆందోళనలు నానాటికీ పెరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు.. రాష్ట్రాలకు కీలక అభ్యర్థన చేశారు. విమాన ఇంధనంపై వ్యాట్ను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఈమేరకు రాష్ట్రాల సీఎంలకు ఆయన(Aviation Minister) లేఖ రాసినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
ఏప్రిల్ 1న ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ATF) ధరలను సవరిస్తారు. ప్రస్తుత పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఇంధన ధరలను పెంచితే.. విమాన టికెట్లపై భారం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి ఈ అభ్యర్థనలు పంపినట్లు తెలుస్తోంది. ‘‘దిల్లీలో విమాన ఇంధనంపై విలువ ఆధారిత పన్ను(VAT) 25 శాతంగా ఉంది. మహారాష్ట్రలో 18శాతం, తమిళనాడులో 29శాతం వ్యాట్ను అమలుచేస్తున్నారు. వీటిని తగ్గిస్తే విమాన టికెట్లపై భారం పడకుండా ఉంటుంది’’ అని కేంద్ర మంత్రి తన లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. ఇదిలాఉండగా.. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన నాటినుంచి ప్రపంచవ్యాప్తంగా ఏటీఎఫ్ ధరలు రెండింతలయ్యాయి. విమాన ఇంధనంపై రాష్ట్రాలు పన్నులు తగ్గించేలా చూడాలని భారత ఎయిర్లైన్లు(Air lines) కొంతకాలంగా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాయి.