ఇంధన ట్యాంకర్లే లక్ష్యంగా.. ఖతార్, కువైట్పై డ్రోన్ దాడి
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకు తీవ్రంగా మారుతున్నాయి. తాజాగా ఖతార్లోని (Qatar) దోహాకు సమీపంలో ఓ ట్యాంకర్పై గుర్తుతెలియని క్షిపణి దాడి చేసింది. ఈ మేరకు యూకే సముద్ర వ్యవహారాల అథారిటీ వివరాలు వెల్లడించింది. పోర్టు పక్కన నిలిచిఉన్న ఇంధన ట్యాంకర్పై జరిగిన దాడి కారణంగా నౌక ఎడమవైపు భాగం దెబ్బతింది. అయితే, దీనివల్ల చమురు లీకేజీకి, పర్యావరణానికి ఎలాంటి నష్టం కలగలేదని అథారిటీ పేర్కొంది. యుద్ధం మొదలైన నాటినుంచి అరేబియా గల్ఫ్, హర్మూజ్ జలసంధి, ఒమన్ గల్ఫ్తో పాటు వాటి పరిసర ప్రాంతాల్లోని నౌకలే లక్ష్యంగా దాదాపు 26 దాడులు జరిగినట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) వెల్లడించింది.
మరోవైపు, కువైట్ అంతర్జాతీయ ఎయిర్పోర్టులోని ఇంధన ట్యాంకర్లే లక్ష్యంగా ఇరాన్(Iran) డ్రోన్ దాడి చేసింది. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ మేరకు దేశ పౌర విమానయాన శాఖ వెల్లడించింది. ఈ దాడిలో ఎవరికీ గాయాలు కాలేదు. కానీ ఇంధన ట్యాంకర్లకు గణనీయమైన నష్టం వాటిల్లినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.