ఇంధన ధర డబుల్.. దేశీయ ఎయిర్లైన్లకు మాత్రం 8.5 శాతమే..!
ఇంటర్నెట్ డెస్క్: ఓవైపు పశ్చిమాసియా ఉద్రిక్తతలతో సతమతమవుతోన్న విమానయాన సంస్థలపై ఇప్పుడు ఇంధన భారం పడింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ATF) ధర ఆకాశన్నంటింది. దాదాపు 115 శాతం పెరిగింది. అయితే, ఈ పెంపు నుంచి దేశీయ ఎయిర్లైన్లకు కేంద్రం ఊరట కల్పించింది. దేశీయ సంస్థలకు ఈ పెంపు పాక్షికమేనని తెలిపింది. అంటే.. దేశీయ సర్వీసులకు ఏటీఎఫ్ పెంపు 8.5 శాతంగానే ఉంది. సాధారణంగా చమురు కంపెనీలు అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా ప్రతినెలా ఒకటో తేదీన ఏటీఎఫ్ ధరలను(ATF Price) సవరిస్తాయి. అలా బుధవారం కిలో లీటర్ ఏటీఎఫ్ ధర ఏకంగా రూ.1,10,703.08 పెరిగి దిల్లీలో రూ.2,07,341.22కు చేరింది. గతంలో కిలో లీటర్ ధర రూ.96,638 ఉండగా.. ఇప్పుడు దాదాపు 114.5 శాతం మేర పెరిగినట్లయ్యింది. ఏటీఎఫ్ ధర రూ.2 లక్షలు దాటడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఒకేసారి భారీ స్థాయిలో ధరలు పెరగడంతో దేశీయ ఎయిర్లైన్లు ఆందోళనకు గురయ్యాయి. ఈ క్రమంలోనే ఈ పెంపును సవరిస్తూ కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ కీలక ప్రకటన చేసింది. ప్రయాణికులకు దేశీయ ప్రయాణాల భారాన్ని తగ్గించేందుకు దేశీయ ఎయిర్లైన్లపై పాక్షిక పెంపును అమలుచేస్తున్నట్లు వెల్లడించింది. దశలవారీగా లీటర్కు రూ.15 చొప్పున పెంచనున్నట్లు తెలిపింది. ఆ లెక్కన ప్రస్తుతం కిలో లీటర్పై ధర 8.5 శాతం మేర పెరిగింది. అయితే, విదేశీ మార్గాల్లో మాత్రం అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా పూర్తి పెంపు అమలవుతుందని స్పష్టంచేసింది. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. అటు ఇండియన్ ఆయిల్ కంపెనీ దీనిపై ప్రకటన చేసింది. దిల్లీలో కిలో లీటర్ ఏటీఎఫ్ ధరను రూ.1.04 లక్షలకు మాత్రమే పెంచినట్లు వెల్లడించింది. దీనిపై ఎయిర్లైన్ల నుంచి ఇంతవరకూ ఎలాంటి స్పందనా రాలేదు. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయాల్లో 40శాతం ఇంధన ధరలకే వెచ్చించాల్సి వస్తోంది. మరోవైపు పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో విమాన సర్వీసులను నడుపుతుండటం వల్ల ఎయిర్లైన్లపై ఇప్పటికే అదనపు భారం పడుతోంది. ఇప్పటికే పలు విమానయాన సంస్థలు టికెట్లపై ఫ్యూయెల్ సర్ఛార్జీలను విధించిన సంగతి తెలిసిందే.