రాఘవ్ చద్దాను తొలగించండి.. మైక్ ఇవ్వొద్దు..రాజ్యసభ్యకు ఆమ్ ఆద్మీ పార్టీ లేఖ
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సంచలన నిర్ణయం తీసుకుంది. రాజ్యసభలో పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి సీనియర్ నేత రాఘవ్ చద్దాను తొలగించింది. ఆయన స్థానంలో మరో ఎంపీ అశోక్ మిట్టల్ను కొత్త డిప్యూటీ లీడర్గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.ఆమ్ ఆద్మీ పార్టీ డిప్యూటీ లీడర్ పదవినుంచి రాఘవ్ చద్దాను తొలగించాలని గురువారం (ఏప్రిల్ 2) ఆప్ అధిష్టానం రాజ్యసభ సెక్రటేరియట్కు అధికారికంగా లేఖ రాసింది. ఆయన స్థానంలో పార్టీ డిప్యూటీ లీడర్ గా అశోక్ మిట్టల్ ను నియమించాలని కోరింది.సభలో పార్టీ తరపున మాట్లాడేందుకు రాఘవ్ చద్దాకు ఇకపై మైక్ ఇవ్వొద్దని ఆ లేఖలో స్పష్టం చేయడం చర్చనీయాంశంగా మారింది.
పంజాబ్ నుంచి రాజ్యసభ ఎంపీ అయిన రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భవించినప్పటినుంచి పార్టీతో అనుబంధం ఉంది. 2012 లో ఢిల్లీ లోక్ పాల్ బిల్లు విషయంలో అరవింద్ కేజ్రీవాల్ తో కలిసి పనిచేయడం ద్వారా ఆయన రాజకీయ జీవితం ప్రారంభించారు. పార్టీలో వేగంగా ఎదిగి జాతీయ అధికార ప్రతినిధి అయ్యారు రాఘవ్ చద్దా. 2015లో ఢిల్లీ ఎన్నికలల్లో ఆప్ గెలిచిన తర్వాత పార్టీలో అతి చిన్న వయస్కుడైన కోశాధికారి అయ్యారు.
రాఘవ్ చద్దా సభలో కీలక ప్రజా సమస్యలను లేవనెత్తి తరచుగా వార్తల్లో నిలిచారు. గ త నెలలో సర్పంచ్ పతి, పంచాయత్ పతి” విదానంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పద్ధతిలో రిజర్వ్ చేయబడిన పంచాయతీ స్థానాలకు ఎన్నికైన మహిళలు తరచుగా నామమాత్రపు అధిపతులుగా మిగిలిపోతుండగా, నిజమైన అధికారాన్ని భర్తలు లేదా తండ్రులు , వారి బంధువులు చెలాయిస్తున్నారని గళమెత్తారు. 73వ రాజ్యాంగ సవరణ ఉద్దేశం ప్రకారం.. మహిళా ప్రతినిధులు స్వతంత్రంగా పనిచేయగలిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 2026 ప్రారంభంలో గిగ్ వర్కర్ల నిరసనల మధ్య, ఆ రంగంలోని వారు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు ,సవాళ్లను మరింతగా అర్థం చేసుకోవడానికి అతను ఒక రోజు డెలివరీ బాయ్ గా పనిచేశాడు. 28 రోజులు రీచార్జ్ ప్లాన్ పై కూడా ఆయన రాజ్యసభలో ధ్వజమెత్తారు.
పార్టీ ఆవిర్భావం నుంచి ఆప్లో కీలక నేతగా ఉంటూ, రాజ్యసభలో ప్రజా సమస్యలపై బలంగా గళం వినిపించిన రాఘవ్ చద్దాను అకస్మాత్తుగా డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సభలో ఆయనకు పార్టీ తరపున మాట్లాడే అవకాశం (మైక్) కూడా ఇవ్వొద్దని అధిష్టానం కోరడం వెనుక ఉన్న అంతర్గత కారణాలేమిటన్నది ఆసక్తికరంగా మారింది.