వెలుగు ఓపెన్ పేజీ: భాషా వివాదాన్ని రగిల్చిన సీబీఎస్ఈ కొత్త సిలబస్
2026–-2027 విద్యా సంవత్సరంలో 6వ తరగతి నుంచి త్రిభాషా విధానం అమలు చేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఈ) కొత్త పాఠ్య ప్రణాళికను ఏప్రిల్ 3న విడుదల చేసింది. కొత్త జాతీయ పాఠ్య ప్రణాళిక ప్రేమ్వర్క్ సిఫార్సుల ప్రకారం త్రిభాషా విధానంలోని మూడు భాషల్లో రెండు భారతదేశానివై ఉండాలి. బహుభాషా విధానాన్ని దశలవారీగా అమలు చేయడంలో భాగంగా 2026-–2027 విద్యా సంవత్సరం నుంచి ఆరవ తరగతి నుంచి మూడవ భాషను సీబీఎస్ఈ తప్పనిసరి చేస్తోంది.
కేంద్ర హిందీని ఏకైక అధికార భాషగా చేయాలన్న ఆలోచనకు వ్యతిరేకంగా 1965లో తమిళనాడులో భారీ ఉద్యమం జరిగింది. ఇది హింసాత్మక అల్లర్లకు, సుమారు 70 మంది మరణాలకు దారితీసింది. ఆ నేపథ్యంలో 1968లో భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖచే పాఠశాల విద్యాస్థాయిలో విద్యార్థులు వివిధ భాషలను నేర్చుకోవాలనే ఉద్ధేశ్యంతో రూపొందించినదే ఈ ‘త్రి-భాషా సూత్రం’. ఇది అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం తరువాత 1968 జాతీయ విధాన తీర్మానం ద్వారా అమలులోకి వచ్చింది. ఈ సూత్రం ప్రకారం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలోనూ మూడు భాషలను ఉపయోగించాలి.