హైదరాబాద్లో కొత్త ఆటోలకు పర్మిట్లు షురూ.. ఆర్టీఏ ఆఫీసులకు క్యూ కడుతున్న ఆటో డ్రైవర్లు
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఆటోలకు అనుమతిస్తూ ఆర్టీఏ అధికారులు అనుమతులు జారీ చేయగా, ఇప్పుడు పర్మిట్లు కూడా ఇస్తున్నారు. నగరంలో ఆరు నెలల క్రితం కొత్త ఆటోలకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం జీవో 263 జారీ చేసింది. దీని ప్రకారం 10 వేల ఎల్పీజీ, 10 వేల సీఎన్జీ, 20 వేల ఎలక్ట్రిక్ ఆటోలు, అలాగే 25 వేల రెట్రోఫిట్టెడ్ ఆటోలను అనుమతించారు.
ముందుగా డీలర్లు ఎల్పీజీ, సీఎన్జీ ఆటోలను అమ్మడం ప్రారంభించగా ఇప్పటివరకు దాదాపు 18 వేలు అమ్ముడయ్యాయి. మరో 2 వేల ఆటోలు కొందరు డీలర్ల వద్ద బినామీ పేర్లతో ఉన్నట్లు సమాచారం. ఆటోలు కొనుగోలు చేసిన వారు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ పర్మిట్లు లేక రోడ్లపై తిరగలేని పరిస్థితి ఉండడంతో ఆటో సంఘాల జేఏసీ నాయకులు ఎ.సత్తిరెడ్డి, వెంకటేశం తదితరులు ఆర్టీఏ కమిషనర్ ఇలంబర్తిని కలిశారు. పర్మిట్లు వెంటనే జారీ చేయాలని కోరారు. స్పందించిన అధికారులు తాజాగా పర్మిట్ల జారీని ప్రారంభించారు. రెండు రోజులుగా ఆర్టీఏ ఆఫీసులకు ఆటోడ్రైవర్లు భారీగా చేరుతున్నారు. ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ అయిన సుమారు 18 వేల ఆటోలకు పర్మిట్లు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు
కాలుష్య నివారణ దృష్ట్యా గ్రేటర్ పరిధిలో 20 వేల ఎలక్ట్రిక్ ఆటోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సీఎన్జీ ఆటో ధర సుమారు రూ.2.40 లక్షలు, ఎల్పీజీ ఆటో రూ.2.30 లక్షలు కాగా ఎలక్ట్రిక్ ఆటోలు రూ.3.80 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఉంటాయని చెబుతున్నారు. ఈవీ ఆటోలకు ఉచిత రిజిస్ట్రేషన్తో పాటు పర్మిట్లు ఇవ్వనుండడంతో డిమాండ్ పెరిగింది. త్వరలో ఈవీ ఆటోలను కూడా అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్టీఏ అధికారులు తెలిపారు.