సోమనాథ్ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు.. 11 క్షేత్రాల నుంచి తీసుకొచ్చిన జలంతో అభిషేకం
గుజరాత్ సోమనాథ్ ఆలయం పున: ప్రారంభించి 75 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా సోమనాథ్లో అమృత్ మహోత్సం జరిగింది. ఈకార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. జ్యోతిర్లింగ క్షేత్రమైన సోమనాథ్లో అమృత్ మహోత్సవం .. చారిత్రక ఘట్టాన్ని చూసేందుకు దేశం నలుమూలల నుండి భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఈ వేడుకలు భారతీయ సంస్కృతి వారసత్వానికి ప్రతీకగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి మోదీ రావడంతో భద్రత పరంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.
ప్రధాని మోదీ ఆలయానికి వెళ్లే ముందు సోమనాథ్ వీధుల్లో భారీ రోడ్ షో ఒకటిన్నర కిలోమీటర్లు నిర్వహించారు. వివిధ రాష్ట్రాల కళాకారులు తమ ప్రదర్శనలతో రోడ్ షోలో సందడి చేశారు. జై సోమనాథ్ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. ఈ ప్రయాణంలో మోదీ అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. 11 పుణ్యక్షేత్రాల జలాలతో పవిత్ర కుంభాభిషేకం ప్రధాని మోదీ సోమనాథ దేవాలయంలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేశారు. దేశంలో 11 పుణ్యక్షేత్రాల నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో స్వామి వారికి అభిషేకం చేశారు. ఆకాశం నుంచి హెలికాప్టర్లతో ఆలయంపై పూల వర్షం కురిపించారు. 1951 లో ప్రారంభమైన ఈ ఆలయ వైభవాన్ని చాటిచెప్పేలా వేడుకలు జరిగాయి.