ఇంటర్ బోర్డు రద్దు.. ఎందుకు? ఎవరి కోసం?
విద్యావిధానం అంటే ఒక వర్గానితో, ఒక సమూహానికో వర్తించే సంక్షేమ పథకం కాదు. విద్య అంటే సమాజంలోని పిల్లలంతా సుశిక్షితులైన మానవ వనరుగా రూపొందించే సుదీర్ఘ ప్రక్రియ. పదేండ్ల పాఠశాల విద్య, రెండేండ్ల్ల ఇంటర్మీడియట్ విద్య, తర్వాత డిగ్రీ/వృత్తి విద్య/విశ్వవిద్యాలయ విద్యతో కూడిన సుదీర్ఘ ప్రక్రియ.
విద్యారంగంలో మార్పులు చేసే ముందు ప్రభుత్వం కూలంకషంగా చర్చలు జరపాలి. ఆ చర్చల్లో మేధావులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, సామాజిక శాస్త్రవేత్తల సూచనలు తీసుకొని, మన సమాజానికి, మన అవసరాలకు అనుగుణంగా మానవవనరులను తయారుచేసే విద్యావిధానాన్ని రూపొందించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్చా లేకుండా, ఎలాంటి డిమాండ్ లేకుండా ‘లేడికి లేచిందే పరుగు’ చందంగా ‘రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్లు ప్రారంభిస్తాం.. పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభిస్తాం.. స్కిల్ యూనివర్సిటీ, క్రీడా విశ్వవిద్యాలయం స్థాపిస్తాం’ అనే ప్రచార ఆర్భాటపు ప్రకటనలతో విద్యావిధానం మెరుగు కాదు. ఇటువంటి ప్రకటనల తర్వాత ప్రభుత్వం విద్యా కమిషన్ను ప్రభుత్వం నియమించింది. ఈ కమిషన్ తన పనులను ప్రారంభించి, సిఫారసులను సమర్పించకుండానే ఇంటర్ విద్యను రద్దు చేసి పాఠశాల విద్యాశాఖలో విలీనం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
తెలంగాణలో ఏటా 5 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పాసవుతున్నారు. వీరిలో 17 శాతం అంటే దాదాపు లక్షకు పైగా ఇంటర్తోనే ఆపేస్తున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ కలిపితే 3,325 జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో ప్రైవేట్ కాలేజీలు 1,482 కాగా, 436 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, 1,002 గురుకులాలు, 475 కేజీబీవీలు, 190 మాడల్ స్కూళ్లు ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. గ్రాస్ ఎన్రోల్మెంట్ నిష్పత్తి 9, 10 తరగతుల్లో 94 శాతంగా ఉండగా, ఇంటర్కు వచ్చేసరికి 83 శాతంగా ఉన్నది. పదవ తరగతి పాసైన విద్యార్థుల్లో 16.5 శాతం మాత్రమే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరుతుండగా, 66.5 శాతం మంది ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో చదువుతున్నారు. ఇంకా 17 శాతం విద్యార్థులు డ్రాపవుట్లుగా ఉన్నారు.
ఇంటర్ విద్య విలీన ప్రక్రియ ద్వారా విద్యార్థుల డ్రాపవుట్లు తగ్గించాలనే బలమైన కారణంగా ప్రభుత్వం చెప్పుకొస్తున్నది. పాఠశాల విద్య పూర్తిచేసిన విద్యార్థులు పైచదువుల కోసం తమ ప్రాంతం నుంచి సుదూరంగా ఉన్న కళాశాలలకు వెళ్లాల్సి వస్తున్నదని, సరైన రవాణా సౌకర్యాలు లేకపోవటంతోనే విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని అధికారులు వివరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ విద్య అందుబాటులో లేకపోవటంతోనే టెన్త్ తర్వాత బాలికలు చదువు ఆపేస్తున్నారని అంటున్నారు.