‘లో ఎమిషన్ జోన్’ గా పుణే.. హైదరాబాద్కూ అవసరమే..
మనదేశంలోని నగరాలు వేగంగా విస్తరిస్తున్నాయి. కొత్త రహదారులు, ఫ్లైఓవర్లు, ఐటీ కంపెనీలు, రియల్ ఎస్టేట్ విస్తరణ అభివృద్ధి సూచికలుగా కనిపిస్తున్నా.. మరోవైపు గాలి కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలు, నీటి కాలుష్యం, శబ్ద కాలుష్యం కూడా ఆందోళనకరస్థాయికి చేరుతున్నాయి. ముఖ్యంగా వాహనాల పెరుగుదల భారత పట్టణ జీవనాన్ని తీవ్రమైన పర్యావరణ సంక్షోభం వైపు నెడుతోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని పుణే నగరం తీసుకున్న ‘లో ఎమిషన్ జోన్ (ఎల్ఇజెడ్)’ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అదే సమయంలో తెలంగాణ నగరాలకు కూడా దాని అవసరం కనిపిస్తోంది.
ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, కార్మిక వర్గాలు వాయు కాలుష్య ప్రభావానికి ఎక్కువగా గురవుతున్నారు. ప్రపంచ ఆరోగ్యసంస్థతోపాటు పలు పర్యావరణ అధ్యయనాలు కూడా భారత నగరాల పరిస్థితిపై పదేపదే ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. ‘అభివృద్ధి- కాలుష్యం’ తెలంగాణ పరిస్థితిని పరిశీలిస్తే ముఖ్యంగా హైదరాబాద్ నగరం ఇప్పుడు ‘అభివృద్ధి- కాలుష్యం’ మధ్య చిక్కుకున్న నగరంగా మారుతోంది. గత రెండు దశాబ్దాల్లో నగరం విపరీతంగా విస్తరించింది. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కొండాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాలు ఐటీ కేంద్రాలుగా అభివృద్ధి చెందగా, మరోవైపు ఎల్బీనగర్, ఉప్పల్, కూకట్పల్లి, మియాపూర్, పటాన్చెరు వంటి ప్రాంతాల్లో జనసాంద్రత వేగంగా పెరిగింది. ఈ విస్తరణతోపాటు వాహనాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్లో భారీ సంఖ్యలో ద్వి చక్ర వాహనాలు, కార్లు, కమర్షియల్ వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయి.
ప్రతిరోజూ ట్రాఫిక్ జామ్ సాధారణమైపోయింది. నగరంలోని అన్ని కూడళ్ల ప్రాంతాల్లో గాలి కాలుష్యం, వాహనాల పొగ ప్రధాన సమస్యలుగా మారుతున్నాయి. కొన్ని అధ్యయనాలు, కాలుష్య పరిశీలన నివేదికలు హైదరాబాద్లో వాయు నాణ్యతపై ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ట్రాఫిక్ అధికంగా ఉండే జంక్షన్లలో పీఎం2.5, పీఎం10 స్థాయిలు అనేక సందర్భాల్లో అనుమతించిన ప్రమాణాలకు మించి నమోదవుతున్నాయని పర్యావరణ వర్గాలు చెబుతున్నాయి. విజయవాడ హైవే మార్గంలో భారీ వాహనాల రాకపోకలు, గిడ్డంగులు, రియల్ ఎస్టేట్ విస్తరణ, నిరంతర నిర్మాణ పనులు గాలి నాణ్యతపై ప్రభావం చూపుతున్నాయి.
కాలుష్యానికి ప్రధాన కారణాలు హైదరాబాద్లో కాలుష్యానికి ప్రధాన కారణాలు.. వాహనాల పెరుగుదల, నిర్మాణ పనులు, రోడ్లపై దుమ్ము, పరిశ్రమల కాలుష్యం, ప్లాస్టిక్, చెత్త దహనం. ముఖ్యంగా పటాన్చెరు, బాలానగర్, జీడిమెట్ల, చందానగర్ పరిసర ప్రాంతాల్లో పరిశ్రమల కాలుష్య ప్రభావం కూడా కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో నీటి కాలుష్యం సమస్యలు కూడా కొనసాగుతున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్ను ‘సరస్సుల నగరం’ అని పిలిచేవారు. కానీ, ఇప్పుడు అనేక చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. హుస్సేన్సాగర్, మూసీ నది పరిసర కాలుష్యం నగర పర్యావరణ పరిస్థితిని ప్రతిబింబిస్తోంది. వర్షాలు పడినప్పుడు వరదలు రావడం, ఎండాకాలంలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవడం కూడా నగర పర్యావరణ అసమతుల్యతకు సంకేతాలు. అయితే ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని చెప్పలేం.