తెలంగాణకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో డేంజర్ ఈదురుగాలుల వర్షం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. నేడు పలు జిల్లాల్లో భారీ ఈదురుగాలులు, పిడుగులతో కూడిన భారీ వర్షం, అల్లకల్లోల వాతావరణం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇటీవల ఉత్తర ప్రదేశ్లో భారీ ఈదురుగాలులు వంటి పరిస్థితి తెలంగాణలో నెలకొనే అవకాశముందన్నారు. పలు జిల్లాల్లో 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.
తెలంగాణలోని నల్గొండ, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, జనగాం, వరంగల్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ డేంజర్ గాలుల సమయంలో జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ వెదర్ మ్యాన్ సూచించారు. ఇక హైదరాబాద్ వాతావారణ కేంద్రం కూడా తెలంగాణలో ఈదురుగాలులతో కూడిన వర్షాలుంటాయని హెచ్చరించింది. భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడా ఈ వర్షాలకు తోడు బీభత్సం సృష్టించవచ్చని పేర్కొంది. సాయంత్రం సమయంలో హైదరాబాద్లో చిరుజల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
మరోవైపు.. ఏపీలో కూడా వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. పలు జిల్లాలో వర్షం కురుస్తుంటే మరికొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత, ఉక్కపోత పెరిగింది. నేడు విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ కడప జిల్లాల్లో 40-42°C మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. ఇక ఆదివారం 19 మండలాల్లో తీవ్రమైన, 30 మండలాల్లో సాధారణ స్థాయితో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
అయితే ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉపరితల ఆవర్తనం విస్తరించిందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, తూర్పు గోదావరి, ఏలూరు, పల్నాడు, మార్కాపురం, కర్నూలు, జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మేఘావృతమై ఉంటుందని, మరికొన్ని చోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.