వంగిన కొబ్బరిచెట్టుతో వీసీకేకు కౌంటర్
చెన్నై: తమిళనాడులో విజయ్ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా రెండు వారాలవుతున్నా ఇంకా అక్కడ రాజకీయం ఏ మాత్రం చల్లారటం లేదు. డీఎంకే, వీసీకే పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రెండుపార్టీలు తమిళనాడు సాహిత్యంతో విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత ఉత్కంఠతో నడిచిన రాజకీయం ఏదంటే.. ఖచ్చితంగా తమిళనాడు రాజకీయాలే అని చెప్పుకోవాలి. విజయ్ టీవీకే పార్టీ అధికారానికి పది సీట్ల దూరంలో నిలిచిపోవడం.. గవర్నర్ ఎట్టిపరిస్థితుల్లో సరైన మద్దతు చూపాలనడం.. మెుదట సపోర్టు చేస్తానని చెప్పిన చిన్న పార్టీలు తరువాత మెుండి చేయడంతో ఆ రాష్ట్ర రాజకీయం సస్పన్స్ థ్రిల్లర్ను తలపించింది. ఎట్టకేలకు అక్కడి కాంగ్రెస్తో పాటు వామపక్షాలు వీసీకే సపోర్టు చేయడంతో విజయ్ పార్టీ గండం గడిచి అధికారం చేజిక్కించుకుంది.
ప్రభుత్వ ఏర్పాటు కోసం టీవీకేకు వీసీకే సపోర్టు ఇచ్చింది. కాగా దీనిపై తాజాగా డీఎంకే, వీసీకే నేతలు తమిళ సాహిత్యంలోని కవిత్వంతో విమర్శలు చేసుకున్నారు. డీఎంకే ఎంపీ రాజా వంకరగ పెరిగిన కొబ్బరి చెట్టు తనను పెంచిన భూమికి కాకుండా ప్రక్కకు వంగి వేరే ప్రాంతానికి కొబ్బరికాయలు ఇస్తుందని తెలిపారు. అంటే పరోక్షంగా వీసీకే డీఎంకే కూటమిలో గెలిచే విజయ్ పార్టీతో చేరిందని చురకలుంటించారు. రెండవ ట్వీట్లో పెరియార్ ద్రవిడియన్ సిద్ధాంతమే తమిళనాడు రాజకీయ, సాంస్కృతిక, సామాజిక గుర్తింపును ముందుకు తీసుకెళుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మారే వరకూ ఎదురుచూస్తాం.. పోరాడటాన్ని కొనసాగిస్తాం విజయం సాధిస్తాం అని అన్నారు.