గ్రౌండ్ వాటర్ వినియోగంలో హైదరాబాద్ సిటీ కన్నా ఢిల్లీనే నయం
హైదరాబాద్ సిటీ జనాభా ఈ మధ్య కాలంలోనే కోటి దాటింది. అదే ఢిల్లీ జనాభా మన సిటీతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ. దాదాపు 3.5 కోట్ల మంది జనాభా ఉన్న ఢిల్లీ.. భూగర్భజలాల వినియోగం విషయంలో మనకన్నా నయమనిపించేలా ఉంది. ఎక్కువగా భూగర్భజలాలు తోడేస్తున్న జాబితాలో రెండో ప్లేస్లో ఉన్నా.. అక్కడి 21 ప్రాంతాలే క్రిటికల్, ఓవర్ఎక్స్ప్లాయిటేషన్ కేటగిరీల్లో ఉన్నాయి. ఇక, మనంత జనాభే ఉన్న బెంగళూరులో జస్ట్ 16 చోట్లనే భూగర్భ జల వినియోగం ఎక్కువగా ఉంది. ఢిల్లీ, బెంగళూరు, ముంబైలాంటి నగరాలు హైదరాబాద్తో పోలిస్తే వాటి పరిధి, జనాభా ఎక్కువే అయినా కూడా అక్కడ భూగర్భజలాల వాడకం తక్కువగానే ఉంది. దానికి కారణం ఆయా సిటీల్లో భూగర్భజల వినియోగంపై కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. అనుమతులు కూడా తక్కువగా ఇస్తున్నారు. వీలైనంత ఎక్కువగా మున్సిపల్ వాటర్ను సప్లై చేస్తున్నారు.
దీంతో భూగర్భజలాలపై అక్కడ ఒత్తిడి తగ్గింది. కానీ, హైదరాబాద్ సిటీ పరిధి ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నది. ‘క్యూర్’ రీజియన్లోకి మరిన్ని ప్రాంతాలు రావడం, డెవలప్మెంట్యాక్టివిటీలు పెరగడం, స్కైరైజ్లు, ఇండిపెండెంట్ఇండ్ల నిర్మాణాలు పెరిగిపోవడంలాంటి కారణాలతో ఇబ్బడిముబ్బడిగా బోర్లు తవ్వేస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం సిటీలో కేవలం 2 లక్షల వరకే బోర్లున్నా.. అనధికారికంగా వేస్తున్న బోర్లు 10 లక్షలకుపైగానే ఉంటాయన్నది అధికారులు చెబుతున్న మాట. కనీసం 500 అడుగుల లోతులో బోర్లు వేస్తున్నారు. స్కైరైజ్లు, పెద్దపెద్ద అపార్ట్మెంట్లలో అయితే అది 2వేల అడుగులను దాటిపోతున్నాయి. దీంతో సిటీలో భూగర్భజలాలపై ఒత్తిడి పెరుగుతున్నది. ఏటా సిటీలో 6.16 కోట్ల క్యూబిక్ మీటర్ల మేర నీటిని తోడేస్తున్నారు. అందులో సేఫ్ జోన్ అన్నదే లేకుండా పోతున్నది. 2.05 కోట్ల క్యూబిక్ మీటర్ల నీళ్లు ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నారు. క్రిటికల్ కేటగిరీలోని ప్రాంతాల్లో దాదాపు 3 కోట్ల క్యూబిక్ మీటర్లు, సెమీ క్రిటికల్ ప్రాంతాల్లో 1.4 కోట్ల క్యూబిక్ మీటర్ల మేర నీటిన భూగర్భం నుంచి తోడుతున్నారు.