Rythu Bharosa | యాసంగి భరోసా లేనట్టే.. సర్కార్ ఎగవేత ఖాతాలో మరో సీజన్ రైతుభరోసా
Rythu Bharosa | హైదరాబాద్, జూన్ 4(నమస్తే తెలంగాణ): యాసంగి రైతుభరోసాకు రేవంత్ సర్కార్ ఎగనామం పెట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండు విడతలుగా రెండు ఎకరాలకు మాత్రమే రైతుభరోసా నిధులు పంపిణీ చేసిన సర్కార్.. నెల దాటినా మూడో విడత పంపిణీ ఊసెత్తడం లేదు. పైగా యాసంగి సాగును పూర్తిచేసుకొని, వానకాలం సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. అయినప్పటికీ, యాసంగి రైతుభరోసా పంపిణీపై సర్కార్ చప్పుడు చేయడంలేదు. దీంతో మరో సీజన్ రైతుభరోసా ఎగవేత ఖాతాలో చేరిందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ యాసంగిలో సర్కార్ రైతుభరోసా పంపిణీలో కొత్త విధానం అమలు చేసింది. తొలి విడతలో రైతులందరికీ ఎకరం భూమికి రైతుభరోసా జమ చేసింది. ఆ తర్వాత ఎన్ని ఎకరాలకు పంపిణీ చేసిందనే లెక్క సర్కార్ వద్ద కూడా లేకపోవడం గమనార్హం.హైదరాబాద్ వార్తలు
యాసంగి రైతుభరోసాను డిసెంబర్ లేదా జనవరిలో పంపిణీ చేయాలి. కానీ, కాంగ్రెస్ సర్కార్ మాత్రం నాట్లు వేసేటప్పుడు కాకుండా కోతలప్పుడు పెట్టుబడి సాయం అందించడం అలవాటుగా చేసుకున్నది. ఇందులో భాగంగానే మార్చి 22న సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఆయిల్పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా తొలి విడత రైతుభరోసా నిధులు విడుదల చేసినట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. తొలి విడతగా రూ.3,447 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది. మరో 20 రోజుల్లో రూ.2,650 కోట్లు రెండో విడతగా జమ చేస్తామని, ఏప్రిల్ ఆఖరు వరకు రైతులందరికీ రైతుభరోసా కింద రూ. 9వేల కోట్లు ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. అయితే, ఏప్రిల్ 20న రెండో విడత కింద ప్రభుత్వం రూ.2,063 కోట్లు విడుదల చేసింది. రెండో విడత పంపిణీ చేసి నెలన్నర అవుతున్నా.. మిగిలిన రైతుభరోసాపై కనీసం చర్చ కూడా చేయడంలేదు. రెండు విడతల్లో కలిపి రూ.5,510 కోట్లు పంపిణీ చేసింది. వాస్తవానికి రైతుభరోసా కింద రూ. 9వేల కోట్లు పంపిణీ చేయాలి. అంటే ఇంకా రూ.3,490 కోట్లు పంపిణీ చేయాల్సి ఉన్నది.