మీ పదేండ్ల పాలన.. మా రెండున్నరేండ్ల పాలనపై.. కేసీఆర్.. చర్చకు రా: సీఎం రేవంత్ రెడ్డి
మహబూబ్నగర్, వెలుగు: ‘మీ పదేండ్ల పాలన.. మా రెండున్నరేండ్ల పాలనపై చర్చిద్దాం రా’ అంటూ బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డి సవాల్ విసిరారు. ‘‘నీకు చేతనైతే.. నీకు పౌరుషం ఉంటే, నువ్వు కేసీఆర్వి అయితే అసెంబ్లీకి రా. నీ పాలనపై, నా పాలనపై చర్చ పెడదాం.. ఒక వేళ చర్చలో నేను ఓడిపోతే నీకు క్షమాపణ చెబుతా.. లేకుంటే నువ్వు ఫామ్ హౌస్లోనే ఉండిపో..’’ అని అన్నారు. -ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులను సీఎం రేవంత్రెడ్డి రెండు రోజులుగా సందర్శిస్తున్నారు. పర్యటన ముగింపు సందర్భంగా శుక్రవారం జడ్చర్ల పట్టణ శివారులో స్థానిక ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్రెడ్డి ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కృష్ణా జలాలపై ఏపీతో చర్చలకు కేసీఆర్ అడ్డు పడుతున్నాడని, తలకిందికి, కాళ్లు మీదికి చేసినా, ఏపీతో కొట్లాడైనా పాలమూరు-–రంగారెడ్డి ప్రాజెక్టుకు 90 టీఎంసీలకు ఎన్వోసీ తెస్తానని, డిసెంబర్లోగా తీపి కబురు చెప్తానని వెల్లడించారు.
కరీంనగర్ నుంచి వచ్చిన కేసీఆర్ను 2009లో పాలమూరు ఎంపీగా గెలిపించి, పార్లమెంట్కు పంపితే ఐదేండ్లలో ఐదు సార్లు కూడా ఇటువైపు రాలేదని సీఎం రేవంత్రెడ్డి మండిపడ్డారు. ఏపీ, తెలంగాణలో పార్టీకి నష్టమని తెలిసినా, కేంద్రంలో అధికారం కోల్పోయినా తెలంగాణ బిడ్డల మరణం చూడలేక సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుచేశారని చెప్పారు. ధనిక రాష్ట్రంగా తెలంగాణను కాంగ్రెస్ అప్పగిస్తే.. రెండుసార్లు అధికారంలో ఉన్న కేసీఆర్అప్పులకుప్పలా మార్చారని విమర్శించారు. మేకవన్నె పులిలాంటి కేసీఆర్ను తెలంగాణ ప్రజలు గుర్తించలేక మోసపోయారని అన్నారు. పదేండ్లలో 8 లక్షల కోట్లు చేతికి ఇస్తే, పాలమూరు జిల్లాలో కనీసం ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని మండిపడ్డారు. దీంతో ఈ ప్రాంతానికి సాగునీరు, తాగునీరు రాకుండా పోయాయని, ఇక్కడి ప్రజల కష్టాలు తీరలేదని వాపోయారు. అధికారంలో ఉన్న పదేండ్లలో ఇరిగేషన్పై కేసీఆర్.. ఏడాదికి రూ.5 వేల కోట్లు ఖర్చు చేసి ఉన్నా,, రాష్ట్రంలో 30 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని సీఎం చెప్పారు. ఇక గోదావరిపై మూడేండ్లలో లక్ష కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం కడితే, అది కూలిపోయిందన్నారు. 2014లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద పది లక్షల ఎకరాలు సాగులో ఉండగా.. ఇప్పటికీ అదే 10 లక్షల ఎకరాలు సాగవుతోందని, ఒకవేళ కేసీఆర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని చెప్పారు.