ప్లాస్టిక్ నిర్మూలనలో సూర్యాపేట మున్సిపాలిటీకి గుర్తింపు
సూర్యాపేట, వెలుగు: ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలనలో సూర్యాపేట మున్సిపాలిటీ రాష్ట్రస్థాయిలో విశేష గౌరవాన్ని దక్కించుకుందని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కొనియాడారు. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో నిర్వహించిన వార్డు సభలో జిల్లా ఎస్పీ నరసింహ, మున్సిపల్ చైర్ పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్ష్మీనాథ్ తో కలిసి ఆయన మాట్లాడారు. పట్టణంలో సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి ఇటుకలను తయారు చేస్తూ సూర్యాపేటను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు వినూత్న ప్రయోగాలు చేస్తున్నామని, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చట్టం ప్రకారం తడి, పొడి చెత్తతో పాటు శానిటరీ, బయో మెడికల్ వ్యర్థాలను విడివిడిగా సేకరించడంలో మున్సిపాలిటీ రాష్ట్రంలోనే ముందు వరుసలో ఉందన్నారు. పట్టణంలోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. అనంతరం ఎస్పీ నరసింహ మాట్లాడుతూ మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, సైబర్ వేధింపుల పట్ల మహిళలు అలర్ట్గా ఉంటూ ఇబ్బందులు ఎదురైతే నేరుగా డయల్ 100 లేదా 112 నంబర్లకు కాల్ చేయాలని సూచించారు.