భవ్య పథకంలో 4 ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు : సంజయ్ జాజూ
హైదరాబాద్, వెలుగు: భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన (భవ్య) పథ కం కింద రాష్ట్రంలో నాలుగు ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు సంబంధించిన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)లను ఈ నెలాఖరులోగా కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ తెలిపారు. ఈ అంశంపై బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఒక్కో పార్కు 500 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
కందుకూరు మండలం తిమ్మాపూర్, ఇబ్రహీంపట్నం ఎలిమినేడు, ఘట్కేసర్ మండలం మాదారం, చౌటుప్పల్ మండలం దండు మైలారంలో పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వీటిలో ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్ తదితర రంగాలకు చెందిన పరిశ్రమల ఏర్పాటుకు పలు ప్రముఖ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. అదేవిధంగా మరో 16 ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు