బీఆర్ఎస్ ఓ పిల్ల పార్టీ..ఎలక్షన్లు, కలెక్షన్ల కోసమే కేసీఆర్ పార్టీ: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ పార్టీకి 140 ఏండ్ల చరిత్ర ఉందని, తమ ముందు బీఆర్ఎస్ ఓ పిల్ల పార్టీ అని పీసీసీ మీడియా అండ్ పబ్లిసిటీ చైర్మన్, ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి విమర్శించారు. ఎలక్షన్లు, కలెక్షన్ల కోసమే కేసీఆర్ ఆ పార్టీని పెట్టారని ఆరోపించారు. ఆదివారం ఢిల్లీలో ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తుచేశారు. మిగులు రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు.
బీఆర్ఎస్కు కాళేశ్వరంపై ఉన్న ప్రేమ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై ఎందుకు లేదని ప్రశ్నించారు. ఇప్పుడు కేటీఆర్ జల ఉద్యమం చేస్తామంటున్నారని, కానీ ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్ను జలసమాధి చేశారన్నారు. జీఆర్ఎంబీ సమావేశానికి వెళ్లి ఏపీ ప్రతిపాదనలను వ్యతిరేకించకూడదా అని ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ రాయలసీమకు వెళ్లి ‘రతనాల సీమ’ చేస్తామని చెప్పలేదా అని నిలదీశారు. జగన్ను ప్రజాభవన్కు పిలిచి గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయని చెప్పింది కేసీఆరేనన్నారు. ఇప్పుడు కాంగ్రెస్కు, సీఎం రేవంత్రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబుతో అవగాహన ఉందంటూ బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. కృష్ణా జలాలు, పాలమూరు–రంగారెడ్డిపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదన్నారు.