Vemulawada Dargah History: వేములవాడ ఆలయంలో 800 ఏళ్ల చరిత్ర ఉన్న దర్గా తరలింపుపై వివాదమేంటీ? కోర్టు ఏం చెప్పింది
వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఉన్న దర్గా తరలింపు అంశం వివాదాస్పదం అవుతోంది. 800 ఏళ్ల చరిత్ర ఉన్న దర్గాను ఎందుకు తరలిస్తున్నారు, అందుకు కారణాలు ఇవే.
వేములవాడ: ప్రముఖ క్షేత్రం వేములవాడలోని దర్గా గత కొంతకాలం నుంచి హాట్ టాపిక్గా ఉంది. ఇక్కడ ఉన్న దర్గా తరలింపు అంశం వివాదాస్పదం అవుతోంది. చివరికి కొందరు కోర్టు మెట్లు ఎక్కడంతో తెలంగాణ వ్యాప్తంగా ఈ దర్గా గురించి మాట్లాడుకుంటున్నారు. దర్గా తరలింపు వ్యవహారంపై సోమవారం విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు తదుపరి విచారణను మార్చి 16కు వాయిదా వేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శితోపాటు వక్స్బోర్డు సీఈవో, వేములవాడ ఆలయ కార్యనిర్వహణాధికారికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
వేములవాడ ఆలయం మధ్యలో దర్గా..
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఓ దర్గా ఉంది. హజ్రత్ సయ్యద్ తాజుద్దీన్ ఖాజా బాగ్ సవార్ దర్గా మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. కొందరు హిందువులు ఆలయంతో పాటు దర్గాను దర్శించుకునేవారు. అదే విధంగా కొందరు ముస్లింలు ఆలయంతో కోడె మొక్కులు చెల్లించుకునేవారు. 12వ శతాబ్దం నుంచి వేములవాడ ఆలయంలో దర్గా ఉండటం విశేషం. 800 ఏళ్ల చరిత్ర ఉన్న ఉన్న దర్గాను ఆలయం నుంచి తరలించాలని తెరపైకి వచ్చింది. అయితే గత రెండు, మూడేళ్ల నుంచి దర్గా తరలింపు అంశం ఊపందుకుంది. భక్తుల తాకిడి పెరగడంతో ఆలయం అభివృద్ధి పనులు చేపట్టిన కారణంగా దర్గా తరలింపునకు అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు. ఇటీవల ఫెన్సింగ్ వేసి, బారికేడ్లు అడ్డుపెట్టి దర్గాకు వెళ్లే దారిని మూసివేయడంతో వివాదం మొదలైంది.