Pawan Kalyan Meets CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
AP CM Chandrababu, Pawan Kalyan Meeting | ఉండవల్లిలోని నివాసంలో ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. తన శాఖలకు సంబంధించిన వివిధ అంశాలపై సీఎంతో పవన్ కళ్యాణ్ చర్చించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. హనుమాన్ కార్యక్రమం ముగియగానే పవన్ కళ్యాణ్ నేరుగా సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఆర్ డబ్ల్యూఎస్, అటవీ శాఖకి సంబంధించిన అంశాలపై చర్చిస్తున్నారు
జల్ జీవన్ మిషన్ పనుల పురోగతి, నిధుల వినియోగం, పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రోడ్ల అభివృద్ధి నిధుల కేటాయింపుతో పాటు, నియోజకవర్గాల వారీగా జరిగిన కేటాయింపులు తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పంచాయతీల్లో చేపట్టిన మ్యాజిక్ డ్రెయిన్ల పనుల గురించి తెలిపి అన్ని పంచాయతీల్లో ఈ తరహా డ్రెయిన్స్ నిర్మించడం ద్వారా పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా అమలు చేయవచ్చని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబుకు వివరించారు.
నీటిపారుదలశాఖ పరిధిలోని డ్రైనేజ్ ల్లో పూడిక తీత అంశాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. వేసవిలో పూడిక తీత పనులు చేపట్టి రైతులు పంటలు వేసేలోపు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అటవీ శాఖ చేపట్టిన హనుమాన్ ప్రాజెక్ట్ వివరాలను పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబుకు తెలియజేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో పలు అంశాలపై మాట్లాడుకోవాలని తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబుతో భేటీ అయి పలు అంశాలపై పవన్ కళ్యాణ్ చర్చించారు.
ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాలు, చిత్తూరు జిల్లాలో ఏనుగుల సమస్యను పరిష్కరించామని పవన్కల్యాణ్ అన్నారు. అటవీ సరిహద్దు గ్రామాల్లో అలర్ట్ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం ఏపీ ప్రభుత్వం హనుమాన్ (HANUMAN) ప్రాజెక్టును చేపట్టింది. మంగళగిరిలో హనుమాన్ కార్యక్రమం ప్రారంభించిన సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. రాష్ట్ర అటవీశాఖ చరిత్రలో ఇదో కీలక అడుగని.. అటు వన్యప్రాణులు, ఇటు మనుషుల మధ్య సంఘర్షణ తగ్గించేందుకే ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు తెలిపారు.