అటవీశాఖ చరిత్రలో ఇదో కీలక అడుగు: డిప్యూటీ సీఎం పవన్
మంగళగిరి: రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలు, చిత్తూరు జిల్లాలో ఏనుగుల సమస్యను పరిష్కరించామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ అన్నారు. అటవీ సరిహద్దు గ్రామాల్లో అలర్ట్ వ్యవస్థ ఏర్పాటు చేశామని చెప్పారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం ఏపీ ప్రభుత్వం ‘హనుమాన్’ ప్రాజెక్టును చేపట్టింది. మంగళగిరిలో ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా పవన్ మాట్లాడారు. రాష్ట్ర అటవీశాఖ చరిత్రలో ఇదో కీలక అడుగని తెలిపారు. వన్యప్రాణులు, మనుషుల మధ్య సంఘర్షణ తగ్గించేందుకే ఈ ప్రాజెక్టును చేపట్టామన్నారు.
సీఎం చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ‘హనుమాన్’ కార్యక్రమం ముగియగానే నేరుగా సీఎం ఇంటికి ఆయన వెళ్లారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్, అటవీశాఖలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. జల్ జీవన్ మిషన్ పనుల పురోగతి, నిధుల వినియోగం, పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రోడ్ల అభివృద్ధికి నియోజకవర్గాల వారీగా జరిగిన కేటాయింపులు తదితర అంశాలపై చర్చ జరిగింది. అటవీశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ‘హనుమాన్’ ప్రాజెక్ట్ వివరాలను సీఎంకు పవన్ వివరించారు.