అతడితో ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేయించాలి: రవిశాస్త్రి
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత టీ20 వరల్డ్కప్లో టీమ్ఇండియా (Team India) టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) ఫామ్లేమితో ఇబ్బంది పడుతున్నాడు. అతడు ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచుల్లో కేవలం 80 పరుగులు మాత్రమే చేశాడు. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో మాత్రమే అతడు బ్యాట్తో (55 పరుగులు) రాణించాడు. అదే సమయంలో ఇషాన్ కిషన్ (Ishan Kishan) ఏడు మ్యాచుల్లో 224 పరుగులు సాధించాడు. సంజుశాంసన్ (Sanju Samson) తాను ఆడిన మూడు మ్యాచుల్లో 143 రన్స్ చేశాడు. వెస్టిండీస్తో జరిగిన కీలకమైన మ్యాచ్లో అతడు 97* పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. ఇషాన్ కిషన్తో ఇన్నింగ్స్ ఓపెన్ చేయించాలని, తుదిజట్టులో రింకు సింగ్కు స్థానం కల్పించాలని సూచించాడు.
‘ఇంగ్లాండ్తో మ్యాచ్కు అభిషేక్ శర్మను కొనసాగించాలి. మానసికంగా ఇబ్బందిపడుతుండటం వల్లే అతడు పెద్దగా స్కోర్లు చేయలేకపోతున్నాడు. గతంలో ఇగ్లాండ్ సిరీస్లో అతడు అద్భుతంగా రాణించాడు. ఇషాన్ కిషన్ను ఓపెనర్గా ఆడించాలి. అలాగే తుదిజట్టులోకి రింకుసింగ్ను తీసుకుని లోయర్ ఆర్డర్లో అతడికి ఛాన్స్ ఇవ్వాలి’ అని రవిశాస్త్రి సూచించాడు.
గత సంవత్సరం ఫిబ్రవరిలో ఇంగ్లాండ్తో జరిగిన అయిదో టీ20 మ్యాచ్లో అభిషేక్ శర్మ భారీ సెంచరీ (135; 54 బంతుల్లో, 7 ఫోర్లు, 13 సిక్స్లు) బాదాడు. అలాగే టీ20ల్లో భారత క్రికెటర్లలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన బ్యాటర్గా నిలిచాడు.