సర్పాలను మోసుకొచ్చిన ‘సాగరకన్య’
సింధియా, న్యూస్టుడే : విశాఖ షిప్యార్డులో మరమ్మతులకు వచ్చిన నౌకలో పాములు ఉండటంతో కార్మికులు పనులు చేయటానికి భయపడుతున్నారు. ‘సాగర కన్య’గా పిలిచే ఈ నౌక సముద్ర అధ్యయనం, భౌగోళిక, వాతావరణ మార్పులను పరిశోధించే సేవలు అందిస్తుంది. అందులో భాగంగా ఈ నౌక కొన్నాళ్లు అండమాన్ తీరంలో ఉంది. ఇటీవల మరమ్మతుల కోసం విశాఖలోని హిందుస్థాన్ షిప్యార్డుకు చేరుకుంది. అయితే పనులు చేసేందుకు కార్మికులు నౌకలోకి వెళ్లగా పాములు కనిపించగా.. భయపడి వెనక్కువచ్చేశారు. నౌక అండమాన్ తీరంలో ఉన్నప్పుడు సమీప అటవీ ప్రాంతం నుంచి పాములు నౌకలోకి చొరబడి ఉంటాయని భావిస్తున్నారు.
భారీ కొండ చిలువ.. నాగుపాములు
సాగరకన్య నౌకలో భారీ కొండచిలువ, తాచు పాములు ఉన్నాయని స్నేక్క్యాచర్ నాగరాజు తెలిపారు. ఇటీవల ఓ పామును ఆయన బంధించారు. నౌకలోని మిగతా పాములు పట్టేందుకు నగరంలోని స్నేక్క్యాచర్స్ను సంప్రదించగా.. రేటు విషయంలో స్పష్టతరాలేదని తెలిసింది. అటవీ అధికారులను కూడా సంప్రదించినట్లు సమాచారం. అండమాన్ వంటి చిన్న దేశాలు/ద్వీపాల వద్ద జెట్టీకి అతిచేరువగానే నౌకలను నిలుపడం వల్లే సులువుగా పాములు చొరబడే అవకాశం ఉంటుందని షిప్యార్డు వర్గాలు చెప్తున్నాయి. పెద్ద షిప్యార్డులో అయితే జెట్టీలకు, నౌకలు నిలిపేందుకు మధ్యలో పాంటూన్లను ఉంచడం వల్ల పాములు లోపలకి వెళ్లే ఆస్కారం ఉండబోదని అంటున్నారు.