తిరుమలకు వెళ్తున్న నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలు, బకెట్లతో ఎగబడ్డ జనం..
పూణే నుంచి తిరుమలకు వెళ్తున్న నెయ్యి ట్యాంకర్ బోల్తా పడటంతో బిందెలు, బకెట్లతో ఎగబడ్డారు స్థానికులు. ఏపీలోని కడప జిల్లా కొండాపురం దగ్గర చోటు చేసుకుంది ఈ ఘటన. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. పూణే నుంచి తిరుమలకు వెళ్తున్న నెయ్యి ట్యాంకర్ కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలోని కొండాపురం చిత్రావతి వంతెన దగ్గర బోల్తా పడింది. ఈ క్రమంలో ట్యాంకర్ లోని నెయ్యిని తీసుకెళ్లేందుకు బిందెలు, బకెట్లతో ఎగబడ్డారు స్థానికులు.
సుమారు 21 వేల లీటర్ల నెయ్యి ట్యాంకర్ లో కేవలం 5 వందల లీటర్లు మాత్రమే మిగిల్చారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునేలోపే ట్యాంకర్ ను ఖాలీ చేశారు జనం. వాటర్ బాటిళ్లు, చెంబులు, బిందెలు ఇలా ఏది దొరికితే అది తీసుకొచ్చి నెయ్యి ఎత్తుకెళ్లారు జనం. కొంతమంది ఏకంగా డ్రమ్ములు తీసుకొచ్చి నెయ్యిని తీసుకెళ్లడం జనాల కక్కుర్తికి నిదర్శనం అని కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. హైవే మీద వెళ్తున్న బైకులు, కార్లు, ఆటోలు ఆపి మరీ నెయ్యి కోసం ఎగబడటంతో ట్రాఫిక్ జాం అయ్యింది.
సమాచారం అందుకున్న పోలీసులు నెయ్యి తీసుకెళ్తున్న జనాన్ని చెదరగొట్టారు. అయితే.. అప్పటికే ట్యాంకర్ దాదాపుగా ఖాళీ అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.