చీకటి కాలం.. దుశ్శాసన పర్వం
సాక్షి, అమరావతి: మహిళాభ్యుదయానికి, మహిళా సాధికారతకు చంద్రబాబు పాలన చీకటి కాలమని, ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్నదంతా దుశ్శాసన పర్వమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎంవైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీని అమలు చేయకుండా మోసం చేసిన చంద్రబాబుకు మహిళా సాధికారత అన్న పదం పలికే అర్హత కూడా లేదని నిప్పులు చెరిగారు. మూడు రోజులుగా చంద్రబాబు సర్కారు ప్రజలకు మూడు డ్రామాలు చూపించిందని, అసెంబ్లీలో ఒక డ్రామా.. పగటి వేషాలు వేసుకున్న అదే ఎమ్మెల్యేతో మరో డ్రామా.. ఈ రెండింటికీ కొనసాగింపుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున చంద్రబాబు నాయుడు ట్రూప్ ఇంకో డ్రామా ఆడిందంటూ ఎద్దేవా చేశారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆదివారం ఆయన పోస్టు చేశారు. ‘నేను నేరుగా చంద్రబాబునాయుడిని అడుగుతున్నా.. జనాభాలో 50 శాతం ఉన్న అక్క చెల్లెమ్మలకు ఎన్నికల ముందు మీరిచ్చిన ఏ ఒక్క హామీని ఇప్పటి వరకు సక్రమంగా అమలు చేయకపోయినా, అన్నీ చేసేసినట్లు విజయవాడలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, పట్టపగలు డ్రామాలాడిన మీకు మహిళా సాధికారత అన్న పదం పలికే అర్హత ఉందా?’ అని నిలదీశారు. ఈ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
⇒ సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లో భాగంగా 19–59 మధ్య వయసున్న ప్రతి అక్కచెల్లెమ్మకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పారు. రాష్ట్రంలో 18 ఏళ్ల పైబడి, 60 ఏళ్ల లోపు ఉన్న మహిళలు ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం కోటి 80 లక్షల మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.1,500 అంటే సంవత్సరానికి రూ.18 వేల చొప్పున ఒక్కో అక్కచెల్లెమ్మకు మూడేళ్లలో రూ.54 వేల చొప్పున బాకీ పడ్డారు. ఆ డబ్బులు ఎప్పుడిస్తారు చంద్రబాబు గారూ?