War Effects: ముంబై, చెన్నైలో గ్యాస్ సంక్షోభం.. మూతపడ్డ పలు హోటల్స్
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లుంది పశ్చిమాసియా యుద్ధ పరిస్థితి. అక్కడెక్కడో యుద్ధం జరిగితే ప్రపంచ దేశాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. గత కొద్దిరోజులుగా ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేస్తున్నాయి. ప్రతీకారంగా ఇరాన్.. ఇజ్రాయెల్, అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తోంది. పైగా హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయడంతో వందలాది ఆయిల్ ట్యాంకర్లు నిలిచిపోయాయి. దీంతో ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది.
ఆ సమస్య ఇప్పుడు భారత్ను కూడా తాకింది. మధ్యప్రాచ్య యుద్ధ సంక్షోభం ఇండియాను కూడా ఇబ్బంది పెడుతోంది. చమురు, గ్యాస్ నిల్వలు తగ్గుముఖం పట్టాయి. దీంతో గృహ వినియోగదారులకు కేంద్రం ప్రాధాన్యత ఇస్తూ.. వాణిజ్య సిలిండర్ల సరఫరాను నిలిపివేశాయి. దీంతో చెన్నై, ముంబైలో గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో ఇరు రాష్ట్రాల్లో పలు హోటల్స్ను మూసేయాల్సి వచ్చింది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైని గ్యాస్ సరఫరా కొరత తీవ్ర ఇబ్బంది పెడుతోంది. గ్యాస్ సరఫరా సంక్షోభం కారణంగా ముంబైలోని 20 శాతం హోటళ్లు మూసివేయబడ్డాయని గ్యాస్ హోటల్ అసోసియేషన్ (GAHAAR) నివేదించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రెండు రోజుల్లో ముంబైలోని 50 శాతం హోటళ్లు మూసివేయాల్సి ఉంటుందని అసోసియేషన్ పేర్కొంది.
ఎల్పీజీ సిలిండర్ల తీవ్ర కొరతపై హోటల్ అసోసియేషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అసోసియేషన్ ఒక లేఖ రాసింది. వాణిజ్య LPG సరఫరాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో రెస్టారెంట్లు, ఆహార సంబంధిత వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో తమకు సహాయం చేయాలని ప్రధాని మోడీని అసోసియేషన్ కోరింది. ఆహార పరిశ్రమ 24/7 పనిచేస్తుందని, ఆస్పత్రులు, ఐటీ పార్కులు, కళాశాల హాస్టళ్లకు ఆహారానికి ప్రాథమిక వనరు ఇదేనని అసోసియేషన్ లేఖలో పేర్కొంది. రైలు ప్రయాణికులు, వ్యాపార ప్రయాణికులకు ఆహారాన్ని అందించడంలో హోటళ్ళు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని గుర్తుచేశారు. సిలిండర్ సరఫరా అంతరాయం కలిగిస్తుందని.. తక్షణమే సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
చెన్నై హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం. రవి మాట్లాడుతూ.. పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. హోటళ్లలో ఇప్పుడు రెండు రోజులకు సరిపడా సిలిండర్లు మాత్రమే ఉన్నాయని.. త్వరలో సరఫరా పునరుద్ధరించబడకపోతే చాలా హోటళ్లు మూసివేయాల్సి వస్తుందన్నారు.