ఖర్గ్పై దాడికి ఇరాన్ రివేంజ్.. దుబాయ్లోని ఫుజైరా పోర్ట్పై డ్రోన్ అటాక్.. నిలిచిపోయిన ఆయిల్ లోడింగ్
టెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతరం అయింది. అమెరికా, ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్నది. సోమవారం 17వ రోజు క్షిపణులు, డ్రోన్ దాడులతో పశ్చిమాసియా రణరంగంగా మారింది. తమ దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టు అయిన ఖర్గ్ ఐలాండ్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేయడంతో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. గల్ఫ్ దేశాల్లోని చమురు క్షేత్రాలే లక్ష్యంగా బాంబుల మోతలు మోగించింది. చమురు పైప్లైన్లు, ఆయిల్ ఫీల్డ్స్ను టార్గెట్గా చేసుకొని క్షిపణుల వర్షం కురిపించింది.
యూఏఈలోని కీలకమైన చమురు ఎగుమతి కేంద్రం ఫుజైరా సమీపంలో డ్రోన్దాడులు జరిగినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి . చమురు లోడింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. పరిస్థితి అదుపులోకి వచ్చాక తిరిగి కార్యకలాపాలు యథావిధిగా ప్రారంభమైనట్టు సమాచారం. ఈ ఘటనతో చమురు సరఫరాకు తీవ్ర విఘాతం కలిగింది. కాగా, అమెరికా–-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల ఇప్పటికే పశ్చిమాసియాలో రోజుకు 7 మిలియన్ బ్యారెళ్ల (ప్రపంచ సరఫరాలో 7%) చమురు ఉత్పత్తి తగ్గిపోయింది.
ఫుజైరాలో అంతరాయాలు తీవ్రమైతే ఒపెక్లో మూడో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు అయిన యూఏఈ తన ఉత్పత్తిని మరింత తగ్గించాల్సి వస్తుంది. ఫుజైరా ఆయిల్ ఫీల్డ్.. హార్మూజ్ జలసంధి వెలుపల ఉన్న కీలక ప్రాంతం. నిరుడు గణాంకాల ప్రకారం.. ఇక్కడి నుంచి రోజుకు సగటున 1.7 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు, శుద్ధి చేసిన ఇంధనాలు ఎగుమతి అయ్యేవి. ఇది ప్రపంచ డిమాండ్లో దాదాపు 1.7 శాతానికి సమానం. కాగా, ఖర్గ్ ఐలాండ్పై అమెరికా జరిపిన దాడులకు ప్రతిచర్యగా, యూఏఈ పోర్టులపై మరిన్ని దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. దుబాయ్లోని జెబెల్ అలీ, అబుదాబిలోని ఖలీఫా పోర్ట్, ఫుజైరా పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు వెళ్లిపోవాలని ఇరాన్ వార్తా సంస్థలు హెచ్చరించాయి. అయితే, అబుదాబి ప్రభుత్వ చమురు సంస్థ ‘ఏడీఎన్ఓసీ’ ఈ ఘటనపై ఇంకా అధికారికంగా స్పందించలేదు. కానీ.. ఇప్పటికే రువైస్ రిఫైనరీని మూసివేసింది.