రజనీకాంత్పై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన టీవీకే నేత
ఇంటర్నెట్డెస్క్: ప్రముఖ నటుడు రజనీకాంత్ రాజకీయ ప్రయత్నాలపై వ్యాఖ్యలు చేసిన టీవీకే (Tamilaga Vettri Kazhagam) పార్టీ జనరల్ సెక్రటరీ అదవ్ అర్జున వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా ఆయన రజనీకి క్షమాపణలు చెప్పారు. ఆయనను కించపరిచే ఉద్దేశం తనకు లేదని వివరణ ఇచ్చారు. బుధవారం తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగిన పార్టీ కార్యక్రమంలో మాట్లాడారు.
‘‘నా నాయకుడు (విజయ్)కు నాయకుడైన రజనీకాంత్ (Rajinikanth)ను కించపరిచే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. అది డీఎంకే కుట్ర అని మాత్రమే నేను చెప్పాను. బహుశా.. ఆయన నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకొని ఉండొచ్చు. రజనీకాంత్ బాధపడి ఉంటారని ఆయన మాటలను బట్టి తెలుస్తోంది. కానీ అక్కడ నా ఉద్దేశం వేరు. ఈ వ్యవహారం విచారాన్ని కలిగించింది’’ అని అర్జున క్షమాపణలు కోరారు (TVK leader apologises to actor Rajinikanth). ‘‘నాకు చాలా చిన్నవయసులోనే ఎన్నికలకు సంబంధించిన విధులు నిర్వర్తించే అవకాశం వచ్చింది. రజనీ తన రాజకీయ ప్రవేశం గురించి ప్రకటించిన వెంటనే 18 శాతం ఓటర్లు ఆయనవైపు మళ్లినట్లు అప్పట్లో సర్వేలు వెల్లడించినట్లు గుర్తించాను. అదొక గొప్ప విషయం. ఆ గణాంకాలు రజనీకాంత్ ప్రత్యర్థుల్లో భయాన్ని సృష్టించింది’’ అని తమిళనాడులోని రాజకీయ పార్టీలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఇటీవల అర్జున ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రజనీ రాజకీయాల్లో ప్రవేశించేందుకు ప్రయత్నించిన సమయంలో డీఎంకే పార్టీ ఆయనపై బెదిరింపులకు పాల్పడిందని ఆరోపించారు. ఈ విషయంలో తాను నటుడిపై విమర్శలు చేయాలనుకోవట్లేదని, ఇలాంటి ఒత్తిళ్లకు తమ నేత విజయ్ (Vijay) తలొగ్గరని చెప్పడమే తన ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను డీఎంకే నేతలు ఖండించారు. అలాగే రజనీకాంత్ తీవ్రంగా స్పందించారు. ‘‘టీవీకేలో ఉన్నతస్థాయిలో ఉన్న నేత నాపై చేసిన వ్యాఖ్యలు అసత్యం. ఈ విషయంలో నేను చెప్పేది ఒక్కటే.. కాలం మాట్లాడకపోవచ్చు కానీ, సరైన సమయంలో అన్ని ప్రశ్నలకు సమాధానమిస్తుంది’’ అని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే.