ఏప్రిల్ 2 నుంచి భూభారతి పోర్టల్ షురూ: మంత్రి పొంగులేటి
భూ పరిపాలనలో సరికొత్త శకం ప్రారంభం కాబోతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. కొత్తగా రూపొందించిన ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ను ఏప్రిల్ 2 నుంచి మొదట 5 మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. గురువారం సచివాలయంలో రెవెన్యూ, సర్వే, స్టాంప్స్, రిజిస్ట్రేషన్, ఎన్ఐసీ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా రెవెన్యూ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తూ భూభారతి పోర్టల్ను అభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి భూలావాదేవీ వివరాలు కనిపించేలా పారదర్శకంగా పోర్టల్ను రూపొందించినట్లు వెల్లడించారు.
ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ను నారాయణపేట జిల్లా కోస్గి, రంగారెడ్డి జిల్లా అమన్గల్, సంగారెడ్డి జిల్లా వట్పల్లి, ఖమ్మం జిల్లా కుసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలాల్లో ఏప్రిల్ 2 నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని తెలిపారు. పైలట్ మండలాల్లో మెరిట్-డీమెరిట్లను క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైన మార్పులు చేర్పులు చేసి రెండో దశలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమలు చేస్తామని పేర్కొన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని తెలిపారు. ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో కలిపి భూభారతి పోర్టల్ను తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. భూభారతి చట్టంలో పేర్కొన్న విధంగా వ్యవసాయ భూములకు సంబంధించి క్రయ విక్రయదారులకు ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ను జతపరచే నిబంధనను 5 మండలాల్లో అమలు చేస్తున్నట్లు తెలిపారు.
తద్వారా రాష్ట్రంలో భూవివాదాలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. 5 మండలాల్లో ప్రతి సర్వే నెంబరుకు ఆధార్ నెంబర్ మాదిరిగా భూధార్ నెంబర్ను ఇస్తామని తెలిపారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా నక్షాలేని 5 గ్రామాల్లో రీసర్వే నిర్వహించి భూధార్ నెంబర్ను కేటాయించామన్నారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ప్రజా కోణంలో ఉంటుందని తెలిపారు. ఒక క్లిక్తో రైతులకు సంబంధించిన భూముల పూర్తి సమాచారం లభించేలా ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ను రూపొందించామని చెప్పారు.