వికారాబాద్ జిల్లాలో అక్రమ డీజిల్ దందా.. ట్యాంకర్ సీజ్ చేసిన పోలీసులు
వికారాబాద్ జిల్లాలో అక్రమ డీజిల్ దందా గుట్టు రట్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. కర్ణాటక నుంచి హైదరాబాద్ కు అక్రమంగా డీజిల్ తరలిస్తున్న ట్యాంకర్ ను శనివారం ( మార్చి 28 ) సీజ్ చేశారు పోలీసులు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలో అక్రమ డీజిల్ దందా గుట్టును టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. కర్ణాటక రాష్ట్రం నుండి హైదరాబాద్కు భారీగా డీజిల్ను అక్రమంగా తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు.
ఈ క్రమంలో పూడూరు మండల పరిధిలో ఒక ట్యాంకర్ను ఆపి తనిఖీ చేయగా.. అందులో నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న సుమారు 7 వేల లీటర్ల డీజిల్ బయటపడింది.వెంటనే అప్రమత్తమైన టాస్క్ఫోర్స్ టీం, డీజిల్ ట్యాంకర్ను సీజ్ చేసి చన్గోముల్ పోలీసులకు అప్పగించారు.
ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ కొరత ఉందనే పుకార్లతో మార్కెట్లో వీటికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఇదే అదునుగా భావించి కొందరు వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుండి తక్కువ ధరకు డీజిల్ కొనుగోలు చేసి.. ఇక్కడ భారీ లాభాలకు అమ్ముకుంటున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనపై చన్గోముల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరనే కోణంలో విచారణ జరుపుతున్నారు పోలీసులు.