ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్: యూపీఐ నుంచి రైలు టిక్కెట్ల వరకూ వస్తున్న మార్పులు ఇవే..
ఏప్రిల్ 1, 2026 నుంచి భారతీయుల ఫైనాన్షియల్ లైఫ్లో కొత్త మార్పులు రాబోతున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంతో పాటే ఆదాయపు పన్ను, బ్యాంకింగ్, రైల్వే, కార్మిక చట్టాల్లో కీలక సవరణలు అమలులోకి రానున్నాయి. సామాన్యుడి జేబుపై ప్రభావం చూపే ఆ ముఖ్యమైన మార్పులకు సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం..
పాత 1961 ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కొత్త 'ఆదాయపు పన్ను చట్టం, 2025' అమలులోకి రానుంది. ఇందులో సెక్షన్ల సంఖ్య 819 నుండి 536కు, చాప్టర్ల సంఖ్య 47 నుండి 23కు తగ్గించారు. పన్ను నిబంధనలు 399 నుండి 190కి, ఫారమ్ల సంఖ్యను 511 నుండి 333కి తగ్గించి సరళీకరించారు. ఇకపై ఫారమ్లన్నీ ఒకేలా ఉండి. డేటా ఆటో-ఫిల్ అయ్యే సౌకర్యం ఉంటుంది.
కొత్త కార్మిక చట్టాల ప్రకారం ఉద్యోగి బేసిక్ పే మొత్తం జీతంలో కనీసం 50% ఉండాలి. దీనివల్ల పీఎఫ్ కాంట్రిబ్యూషన్ పెరిగి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మెరుగుపడతాయి. అయితే చేతికి వచ్చే జీతం మాత్రం తగ్గనుంది. అలాగే సెలవుల కోసం కనీసం 240 రోజులు పనిచేయాలన్న రూల్ ఇప్పుడు 180 రోజులకు తగ్గించారు. గ్రాట్యుటీ ప్రయోజనాలు కూడా పెరగనున్నాయి.
ఏప్రిల్ 1 నుండి పాన్ కార్డుపై పేరు ఉండదు. కేవలం ఆధార్లోని వివరాల ప్రకారమే పాన్ చెల్లుబాటు అవుతుంది. పాన్ దరఖాస్తుకు కేవలం ఆధార్ ఒక్కటే సరిపోదు. పుట్టిన తేదీ ధ్రువీకరణ కోసం 10వ తరగతి సర్టిఫికేట్ లేదా పాస్పోర్ట్ తప్పనిసరి. ఇక పన్ను చెల్లింపుదారులకు ఊరటనిస్తూ.. ITR-3, ITR-4 ఫైలింగ్ గడువును ఆగస్టు 31 వరకు పొడిగించబడింది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏటీఎంలలో 5 ఉచిత లావాదేవీల తర్వాత యూపీఐ ద్వారా క్యాష్ విత్డ్రాయల్పై రూ.23 ఛార్జీ వసూలు చేయనుంది. బంధన్ బ్యాంక్ కూడా మెట్రోల్లో 3, నాన్-మెట్రోల్లో 5 ఉచిత లావాదేవీల తర్వాత రూ.23 ఛార్జీని, బ్యాలెన్స్ లేక ఫెయిల్ అయిన ట్రాన్సాక్షన్కు రూ.25 వసూలు చేయనుంది.