మద్యంప్రియులకు బ్యాడ్న్యూస్..ఆ ఏరియాలో రేపు లిక్కర్ షాపులు బంద్
హనుమాన్ జయంతి సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గురువారం ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని కమిషనర్ ఎం. రమేష్ ఉత్తర్వులు జారీ చేశారు
హైదరాబాద్: హనుమాన్ జయంతి వేడుకల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గురువారం (ఏప్రిల్ 2) ‘డ్రై డే’ ప్రకటిస్తూ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ఎక్సైజ్ చట్టం 1968లోని సెక్షన్ 20 ప్రకారం, గురువారం ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మద్యం అమ్మకాలను నిషేధించారు. ఈ ఉత్తర్వుల ప్రకారం అన్ని వైన్ షాపులు, కల్లు దుకాణాలు మరియు రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు మూసివేయబడతాయి.
అయితే, స్టార్ హోటళ్లు మరియు రిజిస్టర్డ్ క్లబ్బులలోని బార్లకు మాత్రం ఈ నిబంధన నుండి మినహాయింపు ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా లైసెన్సులను కూడా రద్దు చేస్తామని కమిషనర్ హెచ్చరించారు. పండుగ పూట ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రజల ప్రశాంతత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.