బీజేపీ, ఆర్ఎస్ఎస్ ల తీరుతో రాజ్యాంగం ధ్వంసం.. దేశాన్ని అమెరికాకు అమ్మేశారు: రాహుల్ గాంధీ
కోల్కతా: బీజేపీ, ఆర్ఎస్ఎస్లు తమ విద్వేష ఆలోచనా విధానంతో రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. బీజేపీ మతం, కులం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టి ఓట్లు దండుకుంటోందని మండిపడ్డారు. ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు (సర్) రాజ్యాంగ విరుద్ధమని.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అన్యాయంగా తొలగించిన పేర్లను మళ్లీ చేరుస్తామని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
రాయ్గంజ్, మాల్దా, ముర్షిదాబాద్ జిల్లాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో మాట్లాడారు. " బీజేపీ, ఆర్ఎస్ఎస్లు తమ వైఖరితో రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నాయి. ఎన్నికల్లో గెలవడానికి మతం, కులం పేరుతో ఒకరిపై ఒకరిని ఉసిగొల్పుతున్నాయి. అవకాశం దొరికినప్పుడల్లా రాజ్యాంగానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నాయి.అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను భారత్లో విక్రయించడానికి ప్రధాని మోదీ అనుమతించారు. దీనివల్ల మన వ్యవసాయ రంగం నాశనం అవుతుంది. అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందంలో మోదీ భారతదేశాన్ని అమ్మేశారు.
ఇక దేశంలోని చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతపడతాయి. మోదీ దేశభక్తుడు కాదు.. దేశద్రోహి" అని రాహుల్ మండిపడ్డారు. దేశ ప్రజల డేటాను మోదీ ప్రభుత్వం అమెరికాకు ఇచ్చేసిందన్న రాహుల్... దీనివల్ల జాతీయ భద్రత ప్రమాదంలో పడిందని తెలిపారు. వివాదాస్పద ఎప్స్టీన్ ఫైల్స్ను బయటపెడతానని బ్లాక్ మెయిల్ చేస్తూ మోదీపై ట్రంప్ ఒత్తిడి తెస్తున్నారని రాహుల్ ఆరోపించారు. ఈ భయం వల్లే మోదీ దేశ ప్రయోజనాలను పక్కన పెట్టి, అమెరికాకు లాభం చేకూర్చేలా వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నారని విమర్శించారు.