ఇరాన్కు చైనా వెన్నుపోటు.. కారణం అదేనా?
ఇరాన్, అమెరికా యుద్ధంలో నేపథ్యంలో ప్రస్తుతం అన్ని దేశాల దృష్టి హార్మూజ్ జలసంధిపైనే ఉంది. జలసంధిని తెరిచి నౌకల రాకపోకలు జరగాలని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాయి. కానీ, ఇరాన్ మాత్రం.. హార్మూజ్ అంతర్జాతీయ జలమార్గం కాదని.. అది తమ భూభాగానికి చెందిన సముద్ర ప్రాంతమంటూ కొత్త పలుకు ఎత్తుకుంది. అందువల్ల నౌకలు వెళ్లడానికి ఇరాన్ అనుమతి అవసరమని, అలాగే టోల్ వసూలు చేసే హక్కు తమకు ఉందని వాదిస్తోంది. ఇలాంటి తరుణంలో మొట్టమొదటి సారిగా హార్మూజ్ అంశంపై ఇరాన్ మిత్ర దేశం చైనా స్పందించింది. ఇరాన్కు షాక్ ఇచ్చే విధంగా జిన్పింగ్ వ్యాఖ్యానించారు.
హార్మూజ్పై ఇరాన్ వ్యాఖ్యల నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా జిన్పింగ్.. హర్మూజ్ను అంతర్జాతీయ జలమార్గంగా అభివర్ణించారు. హార్మూజ్ జలసంధిని సాధారణ రాకపోకలకు తెరిచి ఉంచాలి. వెంటనే జలసంధిని తెరవాలని ఇరాన్కు సూచించారు. ఇది ప్రాంతీయ దేశాలు, అంతర్జాతీయ సమాజ ఉమ్మడి ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుంది. తక్షణ, సమగ్ర కాల్పుల విరమణను చైనా సమర్థిస్తుందన్నారు. శాంతిని పునరుద్ధరించడానికి దోహదపడే అన్ని ప్రయత్నాలకు చైనా మద్దతు ఇస్తుంది. రాజకీయ, దౌత్య మార్గాల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని సూచిస్తోందని పేర్కొన్నారు.
కాగా, ఇరాన్ ఓడరేవులను అమెరికా దిగ్బంధించడం, ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేసిన తర్వాత చైనా అధ్యక్షుడు తొలిసారిగా ప్రకటన చేయడం విశేషం. అయితే, హార్మూజ్ జలసంధి మూసివేత ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఆసియాలో తీవ్రమైన ఇంధన కొరతకు దారితీసింది. ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. ఈ క్రమంలోనే ఇరాన్ చమురును ప్రధానంగా దిగుమతి చేసుకునే చైనా, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు సుదీర్ఘకాలం కొనసాగుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తోంది. నౌకపై దాడులు..
చైనా ఆందోళన మరోవైపు అమెరికా నావికా దిగ్బంధాన్ని ధిక్కరిస్తూ, చైనా నుంచి ఇరాన్ ఓడరేవుకు వెళ్తున్న ఒక సరకు రవాణా నౌకపై అమెరికా నేవీ కాల్పులు జరపడంపైనా చైనా ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు దేశాలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాయని, కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉంటాయని, ఘర్షణలను రెచ్చగొట్టడం, ఉద్రిక్తతలను పెంచడం వంటివి మానుకుంటాయని భావిస్తున్నాం. అలాగే హార్మూజ్ జలసంధిలో సాధారణ నౌకాయానాన్ని పునఃప్రారంభించడానికి అవసరమైన పరిస్థితులను కల్పిస్తాయని మేము ఆశిస్తున్నాం’ అని పేర్కొంది.